Monday, September 28, 2009

శ్రీశక్తి అయిన లలితావైశిష్థ్యం .

శ్లోకం :
ఓంకార శృతిరూపయా-
కమలజం పుష్ణాతియా నిర్మితా |
విష్ణోశ్చాపి దశావతార సుకృతిం
వ్యాపారయంతీశ్రియా |
జ్వాలా ఫాలతయాభవం ,
లయవిధా వజ్జీవయంతీ శివై: |
సాశక్తిర్లలితా ప్రసీదతు మయి ,
శ్రీభూతిసంధాయినీ ||

నిర్గుణ పరభ్రహ్మ అయిన ఆదిశక్తి మొట్టమొదట " ఓంకార " నాదంతో వ్యక్తమయినట్లు "ఆర్ష వాజ్మయి " చెపుతోంది . మూడువేదాల సమాహారమైన అ+ఉ+మ అనే అక్షరసంయోగశక్తి ఒకటే సకల శృతి ప్రపంచానికి మూలాధారం .

ఆతల్లి తన ఇచ్చా శక్తితో శృష్థిసంకల్పం చేసి బ్రహ్మని శృష్థికర్తగాచేసి , వేదశక్తిని ప్రసాదించి , తాను ఆ శక్తిని వాగ్రూపంగా అందుకొని వాగ్దేవిగా నిలచింది . అలాగే విష్ణువునందు అనుగ్రహశక్తిని , బుద్ధిని వహించి , శృష్థిరక్షణకై అనేక అవతారాలు ఎత్తే సౌభాగ్యాన్ని ప్రసాదించేందుకై లక్షీశక్తిగా విలసిల్లింది .

అటుపిమ్మట అహితాన్ని లయం చేయడంకోసం శివుని నుదుట అగ్నినేత్రం కల్పించి , తానే దహనశక్తిగామారి నిమిత్తమాతృడైన ఈశ్వరునిచే లయకర్మలు చేయిస్థున్నాది . ఇలా ఆతల్లి ఇచ్చాశక్తి , జ్నానశక్తి , క్రియాశక్తులుగా తననుతాను విభజించుకొని త్రిమూర్తుల కార్యనిర్వాహణను పరిపూర్ణం కావిస్తున్నది .ఈశక్తి ఒకొక్క మన్వంతరంలో్ ఒకొక్క రకంగా అవతరించీ , కొన్ని ధర్మాలను ఉపదేశించింది . అవే మన శాస్త్ర్త్రాలుచెప్పిన సదాచారాలు . ఈమె స్వయంభువ మన్వంతరంలో్ బ్రుగుమహర్షి కూతురుగా పుట్టి భార్గవిగా ఖ్యాతికెక్కింది . ఈ ఒక్క జన్మయే ఆమెకు యోనిజన్మ . మిగిలిన అవతారాలలో ఆమె అయోనిజ .
" స్వారోచిష " మన్వంతరంలో అగ్నినుంచీ,
" ఔత్తమ " మన్వంతరంలో జలరాసినుంచీ,
" తామస " మన్వంతరంలో భూమినుంచీ ,
" రైతవ " మన్వంతరంలో మారేడువృక్షంనుంచీ,
" చాక్షుప " మన్వంతరంలో సహస్రదళపద్మంనుంచీ,
" వైవస్వత " మన్వంతరం లో క్షీరసాగరంనుంచీ ఉద్భవించింది .
దుష్థ్థ- శిక్షణకు , శిష్థ్థ-రక్షణకు పలురకాలుగా మానవులకు అర్ధ , పరమార్ధాలను స్ఫురింపజేస్థూ అవతరిస్థున్న అపరమాత్మైకస్వరూపిణి ఆ త్రేలోక్య, త్రిమూర్తి స్వరిపిణి శ్రీమాత .

'' ఓం తత్ సత్ ''
Sunday, September 20, 2009

దేవీ జగజ్జనని

రాగం : మోహన : రూపకతాళం
ఆరోహణ = సరిగపధస
అవరోహణ= సధపగరిస

దేవీ జగజ్జననీ మహిషాసుర మర్ధినీ '' దేవీ ''

రవి, శశిలోచనీ, రమణీ మృదుభాషిణీ
మలయజ వాసినీ దుర్గే నారాణీ '' -దేవీ ''

సర్వమంత్రమయీ , శాంభవి సుందరి
అమేయ విక్రమాసుర దూరీ ,
--అగ్నిజ్వలా రౌద్రముఖీ, సి
ద్ధిర్భవతుమే జ్ఞానసుకీ '' దేవీ ''

భావములోన

శ్లోకం =శ్రీ వేంకటేశా శేషాద్రివాసా
క్షీరసాగరశయన చిద్విలాసా
వైకుంఠపురవాస శ్రీనివాసా
ఇలవెలయు పరమేశా తిరుమలేసా 1

భావములోనా బాహ్యమునందున
భావింతునీనామమే ముకుందా
కాచేదోరవని కరుణాభరణా
వేచితినీకై వేంకటరమణా '' కరములు ''

ఏపుణ్యఫలమో, మానవజన్మము
చేసినకర్మము చేరువౌ నిజమూ
కపటములనువీడి కాం క్షలదునుమాడీ
కంటినీ పదములే కైవల్యమూ....''

భక్తజనావన భాగవతప్రియ
భజమన గోవిందా...........
లక్ష్మీవల్లభ నారాయణహరి
భజమన గోవిందా...........
రాధామాధవ మోహనరూపా
భజమన గోవిందా............
భక్తి ప్రధానా ముక్తిప్రదాతా
భజమన గోవిందా..........

గోవిందా హరి గోవిందా ..
గోవిందా హరి గోవిందా...........

రాగం :అమృతవర్షిణి :ఆదితాళం

అమృతవర్షిణి ఆనందదాయిని
సూనృతవరరూపిణీ జననీ
శివానందలహరే --
హిమగిరినిలయే '' అమృత ''

అవ్యాజకరుణా రససుధనిలయే
దివ్యాయుధధరి అఘసంహారే
దుష్థభయంకరి శిష్థశుభకరి
అష్థభుజే అభిరామే శివే '' అమృత ''

అండపిండ బ్రహ్మండ పాలయే
అఖిలాండేశ్వరి శ్రీచక్రనిలయే
నిఖిల గణాసుర అర్చిత పదయుగళే
సుఖసాగర లహరే శ్రీకళే ---

తకట తకిట ఝణు తాళతరంగే
ధిమిత ధిమిత ధిమి నాదమృదంగే
ఝణుత ఝణుత ఝణు నట్యరసాంగే
తాందవలయకరి శ్హివప్రణయాంగే '' అమృత ''
Wednesday, September 16, 2009

తెలుగు తల్లికి వందనం .

తెలుగు తల్లికి వందనం మన
వెలుగు కీర్తికి స్వాగతం !! తెలుగు !!
చరణం
_________
తెలుగు వెలుగై తరలి వచ్చెను
పలుకు తేనెల సుధలతో
మల్లె మాలల మధుర సౌరభ
మొప్పు మాటల కళలతో !! తెలుగు !!

వేదఘోషలు ,పుణ్య గాధలు
తల్లి నడిచెడు పథములు
తెలుగు తల్లికి వెలుగునిచ్చే
కీర్తి చంద్రిక తారలు
తేటగీతులు ,ఆటవెలదులు
కంద,సీసపు మాలలు
తెలుగు పద్యపు పాదములనిడు
మేలు సిరిసిరి మువ్వలు !! తెలుగు !!

విజయనగర , కాకతీయుల
ఖ్యాతి ఆమెకు వైభవం
రత్నగర్భగ పేరుతెచ్చెను
కోటినిధుల ప్రాభవం
జాతి కవులుగ పేరుగాంచిన
సుతుల కీర్తులె తేజము
ఆంధ్రకేసరి వంటి సుతులకు
మాత ఒడి తరు కల్పము !! తెలుగు !!

మేలు సంస్కృతి నిండు ధనమే
తెలుగు తల్లికి భరణము
సంప్రదాయ , సంగీత రీతులె
వన్నె తెచ్చెడి సద్ధనం
కూచిపూడి నాత్య సంపద
కొలువు తీరిన వైభవం
తెలుగుదనమే మనకు సువరం
తెలుగు బాట అదే స్వర్గం !! తెలుగు !!
____________________
Tuesday, September 15, 2009

రాదామాధవ ..(పాట )

పల్లవి.
________
రాధా మాదవ మోహనగీతం
మదిలో రేపెను సంగీతం
అనుపల్లవి .
________
మదురసుదారస మురళీగానం
పదగతులకు నదె లయసారం !! రాధా !!
చరణం .
__________
బృందావనమున అందాలొలికే
మందార మల్లెలు లేసుమ బాలలు
మధుర సుగంధాల మేలి ముసుగుతో
స్వాగతమిడెనదె చిరునగవులతో !! రాధా !!

కలువల రేడే కొంటె నగవుతో
మబ్బుల చాటున మరలి దాగెనే
కొమ్మల నడుమ కోయిల గీతాలు
కమ్మని కళల రాగాల సాగెనె
మోహన మురళీ నాదమె ఝుమ్మన ...
ఆ.......ఆ................. !!మోహన !!
ఆడెను రాధ అందెలు ఘల్లన !! రాధా !!
__________________

ఎంత మధురమీరేయి ...(పాట )

పల్లవి.
________
ఎంత మధురమీరేయి ,
ఎంత మధుర మీహాయి ,
మదిలో పన్నీటీజల్లు
కురిపించినదోయి ...!! ఎంత !!
చరణం .
________
సరిగమల సప్తస్వర...
రాగ సుధల స్వర ఝరులు ,
మలయపవన మేళకర్త లా ..
మధురిమ వీచికలు !
జన్య,మన్య స్వరభేధపు
భావ,రాగ, లయ,జతులు
ఒకటై ,పద కవితై
నా రచనకు జత కాగ ..!!ఎంత !!

రాగ చాయ రంగరింప
రసమాధురి పొంగగా..
పల్లవి,అనుపల్లవి ..
చెలులష్థచెమ్మలాడగ !
అందెలు ఘల్లని మ్రోగుచు
చరణ గతుల నలరింపగ
అందమైన పాటగా...
ఆడపడుచు అడుగిడగా...!!ఎంత !!
______________________

మధుమాసం ప్రియా ..(పాట )

పల్లవి.
_________
మధుమాసం ప్రియా మనకోసం
తెచ్చెనులే వసంతమే పూల పరిమళం !! మధు !!
చరణం .
________
పూబాలలు నిలిచెరదిగొ ఇంద్రధనుసులా..
మలయపవన వీచికలివె వీచె హాయిగా..!
మధుపమొకటి మధురగీతి పాడె మత్తుగా..
సుధలుచిందె చందమామ మనసు నిండగా..!!మధు !!

సుమశరుడె వచ్చెనదె వలపురేడులా..
పూలరుతువుకధిపతికద చూచెవాడిగా..
తలలనూచె సుమబాలలు కలలు నిండగా..
నా ఎదురుగ నీవుండగ కనుల పండగా..!!మధు !!

కొమ్మమీద కోయిలమ్మ కూసె హాయిగా..
గూటిలోన గువ్వజంట ఊసులాడెగా..
పురివిప్పినె నెమలి ఆడె కళలు నిండగా..
నా మనసే పాట పాడె నిన్ను కలుయగా..!! మధు !!
___________________________

కొమ్మమీది కోయిలమ్మ .....( పాట )

పల్లవి .
__________
కొమ్మమీది కోయిలమ్మ కుహూ అన్నది
నా మనసే పరవసించి ''ఆహా'' అన్నది !!

అనుపల్లవి .
____________
రాగాలా .. సరాగాలా.. ఆ.......
సప్తస్వర సుధలతో ..
పూబాలలు తలలనూచె
వేయి కళలతొ ...!! కొమ్మమీది !!
చరణం.
_________
కన్నెవాగు గలగలమని పారుచున్నది
కలువభామ సిగ్గుతెరల ఒదిగియున్నది !
తారలనడుమ..వలపు గుసగుస వినుమ
వెన్నెలరాజుని కొంటెతనపు వేడుకగనుమ !! కొమ్మమీది !!

చిరుగాలిలొ పయనించే సౌరభాల మధురిమ
వెన్నెలలో విహరించెను పుష్పబాణుడదెసుమ !
ఆడుచు జతుల, గతుల నాట్యపు రతుల
మదిని మరుమల్లెల మత్తు శరము నొదిలె చూడుమ...!! కొమ్మమీది !!
Monday, September 14, 2009

గున్నమావి చెట్టు మీది ..( పాట )

పల్లవి ;
-----------
గున్నమావి చెట్టు మీది కోయిలమ్మ
చిందులేసి నువ్వు పాట పాడవమ్మ !!
అనుపల్లవి
----------
కొమ్మ,కొమ్మకో పలకరింత , నీ
పాటవినగ మది పులకరింత !!
గూటిలోన గువ్వజంట చూడు , పురి
విచ్చుకున్న నెమలి కన్నె చూడు ..
వింత వింత రాగాలు ,
గొంతులోన పలుకు నేడు
పంతమీడి పాట పాడవ !! గున్నమావి !!
చరణం .
---------
కుహూ కుహూ రాగాల గీతులే
సరాగ సంగమ మధురిమలై
ఊహలలో కవి పదములలో , కడు
ప్రేమసందేసాల సరిగమలై
ఉషోదయపు రవి కిరణాలే , తడి
మంచుబిందువుల తళుకులుగ
కురవనీ..అలా మెరవనీ...
పుడమి కళలు కాంతి నాదమై నిండిపోనీ !! గున్నమావి !!

నీలాకాశం మబ్బుల్లో ..
విహరించే శ్వేశ్చా విహంగమై
గలగల పారే సెలయేటా
తేలే చిన్నారి తరంగమై
వీచే గాలి తెమ్మెరవై ...నువు
పూచే పూల పుప్పొడివై
సాగిపోవా.....గానమందుకోవా...నీ
గొంతులోని తీపి ఇలను నింపరావ !!గున్నమావి !!
---------------------------------------------
Sunday, September 13, 2009

అద్దంలో నేను .(కధ)

కుర్చీలో కుర్చొని తదేకంగా అటువైపే చూస్తున్నాను . రాజమ్మ మాసిన బట్టల్ని సర్ఫ్ లో నానబెట్టి శ్రద్ధగా ఉతుకుతున్నాది .ఆమెకు కొంచం దూరంలో ఐదు సంవత్సరాలు నిండని చిన్నపిల్ల చేతిలో బొమ్మతో కుర్చొని ఉంది రాజమ్మ మధ్య మధ్యలో ఆ పిల్లవైపు చూస్తూ పని చేస్తున్నాది . రాజమ్మ కళ్ళల్లో కోటి వెలుగులు .రాజమ్మ అందగత్తే కాదు .కాని ఆమె ముఖం ఏదో కళ , సంత్రుప్తి కలిపిన కొత్త అందాలతో కళ కళ లాడుతున్నాది . నల్లగా , బలహీనంగా ఉన్న రాజమ్మ చుట్టూ ఒక కాంతిపుంజం వలయంగా తిరుగుతున్నట్టు , ఆమె తెలియని వర్చస్సుతో వెలిగిపోతున్నది .ఏదో తెలియని అందం ,ఆకర్షణ , సంతృప్తి ఆమె వద్ద ఉన్నాయి .
ఆమెకున్న ఆ సంతృప్తి తనకెందుకులేదు? ఎప్పుడు ఏదో వెలితిగ, అసహనంగ ఎందుకుంటుంది?
ఈ ఆలోచనలోకూడా అసంతృప్తే .
తనకి అన్నీ ఉన్నాయి .అందం, ఆస్తి , అంతస్తు, అధికారం , చక్కని సంసారం , మంచి భర్త , ఆర్ధిక స్వాతంత్ర్యం , కానీ.....ఏదో వెలితి , ఏదో పోగొట్టుకున్న భావన ఏంటది?
ఆలోచనలలో గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కంటిముందు కదలాడాయి .
-------------------------------------------------------

ఆ రోజు బీరువాలో ఉన్న చీరలన్నీ సద్దుతూ ఉండగ , తను కొన్ని సంవత్సరాలనుండీ కట్టని చీరలు
కనిపించేయి .ఎప్పటికప్పుడు ఎవరోఒకరికి ఇచ్చీయాలనుకుంటూనే , సరేలే మరికొన్నిసార్లు వాడేక ఇవ్వొచ్చు , బాగానే ఉన్నాయి కద ! అనుకుంటు వచ్చింది . అవి వాడడం అవలేదు సరికద , వాటికి మరి నాలుగు చీరలు చేరి , మూలపడ్డాయి . చింకి చీరతో వస్తున్న రాజమ్మకి ఓ రెండు చీరలు ఇద్దామన్న ఆలోచన రోజూ వస్తున్నా, మళ్ళీ రాజమ్మ తనకుతానుగా అడిగినపుడు ఇవ్వోచ్చులే అన్న ఆలచనతో రోజులు గడిచిపోయేయి . వర్షాకాలంలో ఒక రోజు
రాజమ్మ తడిచీరతో పనిచేస్తూఉంటే జాలివేసింది . అటువంటి పరిస్థితులలోకూడా రాజమ్మ నన్ను అడగలేదు .సరే కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాదికదా ,అడిగేదేముందిలే ,ఓ నాలుగు చీరలు తనే యిస్తే పోలే...పాపం కట్టి,విడుపుకు ఉంటాయి , అనుకుంటు ,బీరువా తీసి చీరలు చూసింది . మళ్ళీ అదే పరిస్తితి . ఏ చీర చూసినా బాగానే ఉన్నట్టు ,మరి
రెండు సార్లు కట్టి ఇవ్వోచ్చులే అన్న భావన .
ఎలాగైతేనేం , ఒకటికి పదిసార్లు చూసి, ఓ రెండు చీరలు తీసి ఆమెకు ఇచ్చింది .ఒకటి పమిట దగ్గర చినిగిఉంది , రెండవది ఫాల్ దగ్గర. రాజమ్మ సంతోషంగా ఆ చీరలు తీసుకుంది .ఆ మర్నాడు ఒక చీర కట్టుకుని వచ్చింది . ఆ తర్వాత మామూలుగా తన చింకి చీరతో వచ్చింది .ఆ తర్వాతకూడా ఆమె తను ఇచ్చిన చీరలు కట్టగా, మరి చూడలేదు. ఉంబట్టలేక ఒకసారి అడిగిందికూడా. కాని చిరునవ్వే సమాధానం . ఆ రోజు తనకి చాలా కోపం వచ్చింది . " చీ ,వీళ్ల బుద్ధే ఇంత , పదికో పరకకో అమ్మేసి ఉంటుంది " మరెప్పుడు ఇలాంటివారికి సహాయం చేయకూడదు " అని నిశ్చయించుకుంది
__________________________

కొన్ని రోజులు గడిచేయి . ఆ రోజు సంతలో కూరలు కొనుక్కొని వస్తూ , అకస్మాత్తుగా ఆగి వెనక్కి తిరిగి చూసింది .ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి మరీ చూసింది .అవును ,అదే చీర ,ఆ రంగూ ,ఆ చిరుగు , ''అమ్మో ! అయితే రాజమ్మ తనిచ్చిన చీరని దీనికి అమ్మిందన్నమాట ,'' విసురుగా ఆమె దగ్గరకు వెళ్ళేను . ఎక్కడనుంచీ ఏరుకొచ్చిందో , కసురు మామిడిపిందెలు కింద పోసి అమ్ముకుంటున్నాది . ఆ మాటా, ఈమాటా ఆడి , చీర విషయం అడిగేను . ఆమె ఆ చీరని అపురూపంగా చూసుకుంటూ,వర్షం లో మునిగిపోయిన తన గుడిసె గురించి ,అన్నీ పోయి ఒంటిమీద తడిచీర తప్ప ఏమీ మిగలని స్థితిలో రాజమ్మ తనకి చేసిన సాయం గురించీ, కన్నీళ్ళతో చెప్పి రాజమ్మని పొగిడిన వైనం ,నన్ను తల దించుకున్నట్టు చేసింది .
ఆలోచిస్తూ ఇంటికి వచ్చీ, రాగానే రాజమ్మని అడిగేను " నీకే లేవుకదా చీరలు కట్టుకుందికి ,ఉన్నవి
దానం ఎందుకు చేసెవని " అడిగేను .
దానికి రాజమ్మ " పోనీలే అమ్మా! అన్నీ పోయి సలిలో ఏడుస్తా కూకోనుండాది .బక్క పానం .పక్కనే నానుండీ సూసినా. కట్టి,యిడుపుకి నాలుగు సీరలున్నాయె , ఓ రెండు ఇచ్చీ మానం కప్పుకోమన్న . నాకు కావాలంటె మీలాంటి దరమాత్ములు ,ఇత్తారు దయతలిసి .అందికే ఓరెండు సీరలిచ్చిన .డబ్బు లేనోటోల్లం . ఒకరి కట్టం ఇంకొకరు పంచుకోవడం తప్ప ఇంకేం సేయగలం " అంటూ తన పనిలో తాను నిమగ్నం అయింది .
నేను చటుక్కున తలొంచుకున్నాను. మూల పడున్న వాటిలో ఓ రెండు చీరలు ఇవ్వడానికి ,
సంవత్సరాలుగా నీను చేసిన ప్రయత్నం , ఏమీ లేకపోయినా ,ఉన్నదానిలోనేఆదుకునే రాజమ్మ ఔన్నత్యం ముందు మసకబారినట్లయ్యింది .
_________________

మరికొన్ని రోజులు గడిచేయి .పేపర్లో వార్తలు చదువుతూ యధాలాపంగా చూసేను . వరదల్లో అన్నీ కోల్పోయి ,అనాదులైన పిల్లలని ఆశ్రమాలకి తరలిస్తున్న వైనం , ఎవరైనా పెద్దమనసుతో చేరదీసి పెంచుకున్నాసరే ,లేదా వారి పెంపకానికి అయ్యే ఖర్చు కొంతైనా జమచేసినాసరే , లేదా ఒక పిల్ల బాద్యత అయినా తీసుకోతలచినవారు
సంప్రదించవలసిన చిరునామాతో పాటు , ఇచ్చిన వివరాలు చదివి , అనాధలైన పిల్లలగురించి వాపోతూ , ఒక భారమైన
నిట్టూర్ఫు విడిచి పనిలో జోరపడ్డాను.
రెండురోజులు గడిచేయి . రోజూ తెల్లారే రావలసిన రాజమ్మ ఆరోజు ఎనిమిది కావస్తున్న రాకపోయేసరికి , పనిమీద బెంగతో కాలుకాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ ,రోడ్డు చివరంటా చుడడానికోసం మా హాలు కిటికీ దగ్గరకు వెళ్ళిన నాకు , అక్కడి దృశ్యం చూసేక నోట మాట రాలేదు . కారణం సొసైటి గార్డెన్ లో మొక్కలకి నీళ్లు పోస్తూ రాజమ్మ కనిపించింది ." తన పనులన్నీ వెనక్కిపెట్టి ఈవిడగారు చేస్తున్నపని ఇదన్నమాట . చివ్వున వస్తున్నా కోపాన్ని అణుచుకొంటూ అటే చూస్తున్నాను. చిన్నప్పుడే ఏదో ప్రమాదంలో ఒక కాలు పాదం పోగొట్టుకున్న రాజమ్మ కుంటుతూనే పనికి వస్తూ ఉంటుంది . కూర్చొని చేసేపనులు తప్ప మరేమే చెయ్యననె ఒప్పందంతోనే పనిలో కుదురుకుంది .అలాంటిది ఈ రోజు కుంటుతూ అతి కష్థంతో మొక్కలకి నీళ్లు పోయవలసిన అవసరం ఏమొచ్చింది?
ఆలోచలలో ఉంతుండగానే సమయం గడిచిపోయింది . తొమ్మిదిగంటలౌతుండగా తలుపు కొట్టిన రాజమ్మని చూసి విసుక్కుంటూనే కారణం అడిగేను .ఆమె ఎప్పటిలాగానే చిరునవ్వు సమాధానంగా , పనిలో జొరపడింది . అడిగినదానికి జవాబు చెప్పని దాని నిర్లక్ష్యానికి ఒళ్లు మండినా, ఆ రోజు నాగా పెట్టనందుకు అమ్మయ్య అనుకుంటూ నేనుకూడా నా పనిలో లీనమయ్యాను. కాని నా ప్రశ్నకు సమాధానం మర్నాటి పేపర్లో దొరికింది . కళ్లు పెద్దవిచేసుకు మరీ చూసేను . అవును అది రాజమ్మ ఫొటోయే . ఆశ్చర్యంగా ఫొటో కింద రాసిన లైన్లు చదివేను .
రాజమ్మ తను బతికున్నంతకాలం ఒక అనాధ పిల్లకి అయ్యే ఖర్చులో ,తన వంతుగా ఐదువందలు భరించే బాధ్యత స్వీకరించినట్లు , ఉన్నతహృదయమున్న రాజమ్మ లాంటి సహృదయులు ఉండబట్టే సేవాశ్రమాలు చాలావరకు ఏలోటూలేకుండా నడుస్తున్నాయని , అనాధ పిల్లల సహాయార్ధం మొట్టమొదటి వ్యక్తిగా రాజమ్మ ముందుకు వచ్చిందని , రాజమ్మని పొగుడుతూ రాసిన వైనం కొసదాక చదవలేకపోయాను. ఆ రోజంతా మౌనంగా గడిపేను .ఎవరో అనాధపిల్లకి ఐదువందలు ఇవ్వడంకోసం , సొసైటీపని చేస్తున్న రాజమ్మ మహోన్నతంగా కనిపించసాగింది .
ఆ తర్వాత చాలా రోజులు ఆమె ఎదురుగా కూర్చోని పేపరు చదవలేకపోయాను.కొన్ని నెలలు గడిచేయి .
________________________________

సునామీ ఉదంతం ,ఎవరూ చెప్పకపోయినా ప్రతీ చేవికీ సోకిన వార్త. ప్రతీ టి.వి.లోనూ ,వీధిలోనూ అదే ప్రసంగం. బయట ఎక్కడపెడితే అక్కడ డేరాలు వేసుకొని ,మైకుల్లో చెపుతున్నారు , అనాధలైనవారిని ఆదుకోమని , ధనరూపేణాగానీ, వస్తు రూపేణాగానీ, పాతబట్టలు ఇచ్చిగాని , ఏదో విధంగా సహాయం చెయ్యమని కోరుతున్నారు .
తలిదండ్రుల్ని పోగొట్టుకున్న పిల్లలు ,ఇల్లు ,ఆస్తి పోయి ఆక్రోసిస్తున్నవారిని ,పదే పదే చానల్స్ లో చూపిస్తున్నారు .
ప్రతీ వారి నోటా జాలిమాటలు ,వేడి నిట్టూర్పులు .
మా సొసయిటీవారంతా కలసి , ఏదైనా సహాయం చేద్దామని ,నాలుగు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నరు .అదిగో అంతలోనే రాజమ్మ ఈ పిల్లని వెంటేసుకువచ్చింది . ఈ పిల్లెవరే రాజమ్మా,అని తను అడిగినదానికి రాజమ్మ " ఏమో ,తెల్వదమ్మా .ఏదైనా సాయం సేద్దామని ,సునామీ జనాలకాడకి పోయినా. ఇదిగో ఈ బిడ్డ నా కొంగట్టుకొని ""అమ్మా ..అంటూ , ఏడుపందుకుంది . నా పానం ఆగనేదు . ఆళ్లని బెతిమినాడీ ఈ పిల్లని పెంచుకుందామని తెచ్చినా.నాతోపాటే ఉంటాది .పనిసేసే ఈడొస్తే దాని కూడదే సంపాదిస్తది'' అంటూ దానిని అక్కున చేర్చుకుంది .
తల దువ్వుకుంటూ రాజమ్మ మాటలు వింటున్న నాలో ఏదో అలజడి ., అశాంతి . అన్యమనస్కం గా బొట్టు పెట్టుకుందామని అద్దం లోకి చూసిన నేను ఉలిక్కి పడ్డాను . అద్దంలో నా మొహం , స్ఫోటకం చుక్కలతో ,బొల్లి మచ్చలతో వికృతంగా కనిపిస్తున్నాది . గాభరాగా , చటుక్కున తల తిప్పుకున్నాను .
ఇదేంటీ..తెల్లగా ,అందంగా ఉన్న నా మొహం ,ఇంత వికృతంగా ఎలాగయ్యింది ? అనుకుంటూ వణుకుతున్న చేతులతో
మొహాన్ని తణుముకున్నాను. అంతే .....నాలో మరో మనిషి వికృతంగా నవ్వింది . " నీ అసలు రూపదే. పైకి కనిపించినంత అందమైనదికాదు నీ లోపలి మనసు. అన్నీ ఉన్నా ఏదో తక్కువ అయిందన్న అసంతృప్తి నిన్ను వేధిస్తున్నదానికి కారణం నీకు సంకుచిత మనస్తత్వం ఉండడం వల్లనే . నీకు మనసు లేదు , మనిషిగా మనిషికి సహాయపడే గుణం అస్సలు లేదు .అందికే నీ రూపానికి అందం లేదు "" అంటూ పగలబడీ నవ్వుతున్నాది .
ఒక్క క్షణం అయోమయంగా నిలుచున్నాను . ఎదురుగా తల వంచుకు పని చేస్తున్న రాజమ్మ మహా మనీషిలా, ఆమె ముందు నేను అతి చిన్న మరుగుజ్జులా అనిపించ సాగేను .
అంతే ! ఒక నిస్చయానికి వచ్చేను . గబ గబా చీర కట్టుకొని , చేక్కు బుక్కు తీసుకొని , బీరువా తెరిచేను .
అవి, ఇవి అని చూడకుండా ,చేతికందిన చీరలు సంచిలో కుక్కి " రాజమ్మా ! తలుపెయ్ ! ఇప్పుడే 'వస్తానంటూ''
బయలుదేరేను .
నడుస్తున్న నాలో నిండుదనం . అవును . నాకిప్పుడెంతో తృప్తిగా ఉంది . ఏదో దివ్యమైన వరం పొందిన సంతృప్తి . ఇన్నాళ్లూ నాలో లేనిది పొందానన్న ఆనందం .
అవును ,ఇకనుంచీ ఏ విషయంలో నైనా సరే నా మనస్సు వెనక్కి లాగదు .లాగనివ్వను ,అనుకుంటూ ఆటోరిక్షాని పిలిచేను .

సమాప్తం.
* * * * *