Tuesday, November 10, 2009

ఏమే....ఒసేయ్ ....|

ఏమే...ఒసేయ్ .
*****

ఒసేయ్ ...ఇలారా | గర్జించిన తండ్రిముందు వణుకుతూ వచ్చి నిల్చుంది ఏడు సంవత్సరాలు నిండని చిన్నారి మల్లి .
కాళ్లుకడుక్కుందికి నీళ్లుపట్రా... చెప్పులువిడిచీ . .. మల్లివేపుచూస్తూ ఆజ్నాపించేదు తండ్రి.
ఒసేయ్ ... ఇలారా... నేనుకాస్తా రంగమ్మత్త ఇంటికి వెళ్తాను , వచ్చేసరికి ఆ కాస్తా అంట్లు తోమిపెట్టు ,తమ్ముడిని ఎత్తుకువెళ్తూ అమ్మ .....ఆర్డర్ .
ప్రతీరోజూ ఒసేయ్ అన్న పిలుపుతోపాటు మరుగుపడుతున్న తనపేరుని జ్నాపకం తెచ్చుకుందికి కూడా సమయం లేకా...కాలంతో రాజీ పడింది మల్లి. తమ్ముడిని మాధవా ... మాచిన్ని కన్నా అని పిలుస్తూ గారం చేస్తున్న అమ్మ, నాన్నలు తనని '' ఒసేయ్ '' అంటూ ఎందుకు పిలుస్తున్నారో అర్ధంకాకా , కాలంతో పాటు తనకి నచ్చని పిలుపు '' ఒసేయ్ ''తో రాజీ పడింది .

కరిగే కాలంతో , పెరిగే వయసు పెద్దరికాన్ని తెచ్చిపెట్టింది .కన్నుమూసిన తల్లి భారాన్ని పూర్తిగా తనపై వేసుకొని బండెడు చాకిరీతో భారంగా ఒదిగింది పదిహేను సంవత్సారాల మల్లి.

ఒసేయ్ | ఇలారా... తండ్రి పిలుపుకు జవాబుగా ఎదురుగావచ్చి నిల్చుంది పెళ్లివారొస్తున్నారు , వెళ్లి తయారవ్వు , తండ్రి హూంకరింపు . 15'' సం '' తనకు పెళ్లా....? ఆలోచనలమధ్య ,ఇరుగు,పొరుగుల హాస్యాల మధ్య ఏవేవో తీపి లోకాల్లోకి వెళ్లిపోయింది .

అవును , తనకి పెళ్లయితే '' ఒసేయ్ '' అన్నమాట ఇంక వినపడదు . మల్లీ.....అంటూ ..ప్రేమగా పిలిచే భర్త , అత్తగారు , ఆడబిడ్డలూ.... అవును , తను అత్తవారింట '' మల్లి '' గా మన్ననలు అందుకుంటుంది. ఆనందంతో అందంగా తయారయ్యింది .

పెళ్లిచూపులూ, కట్నాలూ, తాంబూలాలూ, ఆఖరికి పెళ్లికూడా అయ్యింది . పులకరించే మనసుతో అత్తారింట అడుగుపెట్టింది .
అత్తింట్లో మొదటిరోజే నిరాశ ఎదురయ్యింది '' ఒసేయ్ '' నా పర్సేదీ... అన్న భర్త పిలుపుకి కంట్లో నీళ్లుతిరిగేయి .ఒకరి తర్వాత ఒకరిగా ఆ యింట్లొ అందరూ పిలిచే '' ఒసేయ్ '' అన్న పిలుపుకి రాజీపడింది ., తమ్ముడిని మాధవ్ గా, తనని '' ఒసేయ్'' గా మార్చిన కాలాన్ని నిందిస్తూ.....

సంవత్సరాలు రోజుల్లా, రోజులు క్షణాల్లా , నలుగురు పిల్లలకి తల్లిగా...బండడు చాకిరీకి బానిసగా...మార్దవం ఎరుగని మల్లి , బడలి, వడలీ , మంచం పట్టింది.

'' ఒసేయ్ '' పొద్దెక్కింది ,వేగం లేచీ తగలడు . వెధవ రోగమా...అని , ఎక్కడలేని డబ్బూ.. దీని జబ్బులకే .''..భర్త విదిలింపు ....
'' ఒసేయ్ | ఎన్నాళ్లీ నంగనాచివేషాలు , పడుక్కుంటే పన్లెలాఅవుతాయీ...'' అత్తగారి ఈసడింపు ..'' చేసినచాకిరీచాలు .. చాలించు నీ ఓర్పు '' నిస్థ్థ్రాణగా పడివున్న శరీరానికి ,మనసు ఇచ్చే తీర్పు , కంట్లోంచీ కారుతున్న కన్నీటి ఓదార్పు .

మగతగా పట్టిన నిద్దురలో... చెదురు మదురుగా మెదులుతున్న జ్నాపకాలు . చెవులో...''.ఒసేయ్ ...ఒసేయ్ ....ఒసేయ్ '' ల హొరు . ఒక్కటంటే ఒక్కటైనా తీపి జ్నాపకం ఎరుగని మల్లి మనసు మూగగా రోదించింది .

'' ఒసేయ్ ''...ఎవరెవరో పిలుస్తూ ....ఏదేదో చెప్తూ ....ఎన్నెన్నో అంటూ.....

మల్లికి మాత్రం ఏమీ స్పష్థ్థంగా వినపడడం లేదు . కంటిముందు బంగారు వెలుగు ....ఆ వెలుగులో ఎవరో చేతులుచాస్తూ ప్రేమగా పిలుస్తున్నారు .'' రా...మల్లీ ''...అంటూ....

అదే...అదే... ఈ పిలుపుకోసమే తను ఇన్ని సంవత్సరాల నుంచీ ఎదురుచూసినది . తనను తానుగా గుర్తింపబడిన ఈ తీయని పిలుపు ......ప్రేమగా తనను అందరూ పిలవాలనుకున్న చల్లని పిలుపు ...చిన్నప్పటినుండీ తను ఆశగా వినాలనుకున్న తీయని పిలుపు ...తనకి పెట్టిన అందమైన పేరుగా మూలపడిన ముద్దుల పిలుపు '' మల్లి ''....మధురంగా.....మృదువుగా......ప్రేమగా.....

'' మల్లి '' కళ్లుమూసింది సంత్రుప్తిగా.....అనంత విస్వబాహువుల్లో సేదతీర్చుకోవడానికి ...అందనితీరాలకి పయనిస్తూ....

'' మల్లి '' గా పరిమళిస్తూ...
___________________

మధుర స్మృతి .

*****

హడావిడిగా భర్తని ఆఫీస్ కి , అల్లరిచేసే పిల్లలని స్కూల్ కి పంపీ భారంగా ఊపిరితీసుకున్నాను. అలసిన శరీరాన్ని సేదతీరుస్తూ ఈజీ చైర్ లో నడుం వాల్చేను . రిలేక్స్ అవుతున్న నా చెవులకి హాయిగా వినిపిస్తున్నాదొక చప్పుడు. టప్ ....టప్ ......టప్ .......

అలసట మర్చీ , ఒక్కసారిగా లేచీ కిటికీవైపు పరుగెత్తేను. '' బయట పడుతున్న వర్షం '' ఒక్కసారిగా నాపై చిరుజల్లుగా.....చల్లగా....హాయిగా....... పడీ.... సేద తీర్చినట్లయ్యింది . ఉత్సాహం గా పెరటిలోకి పరుగెత్తేను. వర్షం లో తడుస్తూన్న నన్ను, నా ఆలోచనలు , ఏవేవో మదుర స్మృతులలోకి తీసుకువెళ్లేయి .

'' వర్షం '' ఆనందానుభూతికి మూసుకుపోయే కన్నులముందు , కదలాడే చిన్నప్పటి చిరుఝల్లుల జ్నాపకాలు.........అవును ...ఇదే వర్షం .....వర్షం లో తనూ, తన స్నేహితురాళ్లూ.... ఆట , పాటలూ....గిల్లికజ్జాలూ.....

*****

చేతుల్లో వేతులువేసీ '' వానా వానా చల్లప్పా...'' అంటూ పాడుకుంటూ , గుండ్రంగా గింగిరాలు తిరిగే
చిన్ననాటి చిలిపి సరదాలు ......

చెట్ల ఆకులపై పడే వర్షపు నీటిబొట్ల ని , నోరుపట్టీ జుర్రుకొనే ఆనందపు క్షణాలు .........

గొడుగుల్లో ఒదుగుతూ , కేరింతలు కొడ్తూ జిలిబిలి కబుర్లతో , తడుస్తున్న ఒంటిని తోపులాటలతో ఇంకా తడుపుకుంటూ స్కూలుకి వెళ్లే ఎత్తుపల్లాల కాలిబాటలు ........

వర్షానికి తడిసిన పచ్చని గడ్డి , వేసిన తివాచీల తోరణాలు.........ఎదిగిన పైరు బాలలు తడిసీ తలవంచే సిగ్గు సింగారాలు ....వర్షపు నీటిలో తడిసిన ముద్ద మందారాలు , నిండిన నీటి మడుగుల్లో వయ్యారంగా వాలి, కవ్వించే కలువభామల మేని సొగసుల
......... వయ్యారాలు...................

చిరుజల్లులతో కలిపి వీచే చల్లని గాలుల నుండీ వచ్చే , తడిసిన మట్టి సుగంధాలు .......

పిల్లకాలువల పారే నీటిలో పోటీలతో వేసే , రంగు రంగుల కాగితపు పడవల పరుగుల వరుసలు ......

వేడి, వేడి ఫల్లీలు తింటూ... ఉరుములశభ్దాన్ని వింటూ...., మెరిసే మెరుపుల్ని వింతగా చూసే , అమాయక
విస్మయ చిన్నారి చూపులు .....

శ్రావణమాసపు నోముల సందడిలో , పట్టు పరికిణీ..పావడాల రెప రెపలతో..., అమ్మ చేయి పట్తుకొని,
అమ్మలక్కల ఇళ్లకి '' పేరంటానికి '' వెళ్లే తోవలో , గుడి నుంచీ వినిపించే జేగంటల చిరు గణ, గణలు ......

అట్లతదియరోజు ఐదు గంటలకే లేచీ , '' ఉట్తికింద ముద్దలు '' తిని , ఊయలలాటకై ఉత్సాహంగా
పరుగులుతీసే కాలిమువ్వల గలగలలు ........

రాత్రి కాగానే నానమ్మ పక్కలో వెచ్చగా ఒదిగీ , ఆమె చెప్పే చిట్టి పొట్తి కధలు వింటూ...
భయం, ఆశ్చర్యం , ఆనందాల మిశ్రమాల పసిహృదయపు పులకరింతలు .......

ఇలా ఎన్నో....ఇంకెన్నో.....చిన్ని చిన్ని చిలిపి జ్నాపకాలు, నాలో ఇంకా మాసిపోని బాల్యస్మృతులు .
ఆ రోజుల్లో ప్రతీ రోజూ ఒక కొత్త వెలుగు. ప్రతీక్షణం ఒక నందనవనం , మరువరాని , మరవలేని మధుర తరంగాలు .....

ఆ రోజులు తిరిగి వస్తాయా......? అలోవకగా ఆలోచిస్తున్న నేను, చెవులకి వినిపించే కాలింగ్ బెల్
మోతకి ఉలిక్కి పడి , గడియారం వేపు చూసేను . సాయంత్రం 5.30 కావస్తున్నాది .

పాత జ్నాపకాల అలల్లో కదలాడే నాకు కదలిపోయే సమయం తెలీలేదు '' ఉస్సురంటూ '' పెరట్లోంచీ
కదిలేను . ఆయనా, పిల్లలూ వచ్చినట్లున్నారు ...'' టిఫిను ఏమి చేయాలబ్బా '' అనుకుంటూ , తలుపుతీసీ వంటింటివైపు కదిలేను ............

'' రొటీను '' గా............

స్వామివారి కల్యాణం

Swaamivaari Kalyaanam
స్వామివారి కల్యాణం .
*****

ఆడిటోరియం జనంతో కిటకిట లాడుతోంది . పిల్లలూ , పెద్దలూ ,ముసలివాళ్లూ , వయసులోఉన్నవారూ , అందరూ వచ్చేరు. చిన్నపిల్లల ఆటలకోసం ఒకపక్క రంగులరాట్నం , ఊయలలూ ఏర్పాటు చేసేరు . ఆచుట్టుపక్కల పిల్లలకేరింతలు , ఏడ్పులు , పెద్దల సముదాయింపులతో గందరగోళంగా ఉంది . వయసులోవున్న పిల్లలు మరికొంచంసేపటిలో మొదలవ్వబోయే ఆర్కెష్థ్ర్రా గురించి , పాటలగురించి మాటలాడుకుంటున్నారు . .వృద్ధులు ఉత్తరీయాలు సవరించుకుంటూ , నారాయణనామజపం చేసుకుంటూ , జరగబోయే స్వామివారి కల్యాణం మొదలెట్టే సమయంకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు . కొంతమంది కల్యాణంకి కావలసిన పూవులు ,తులసీ కలిపి మాలలు కడుతున్నారు.

కొద్దిదూరంలో ష్టేజ్ మీద కల్యాణమండపం రంగురంగుల లైట్లకాంతితో కళకళలాడుతున్నాది . పూల ఆసనం మీద మంగాసమేతుడైన స్వామివారివిగ్రహం , పట్టుపీతాంబరాలతో శోభాయమానంగావుంది . స్వామితరఫు వారూ , మంగమ్మ తరఫువారూ , పూజాది , వివాహ సరంజామాలతో సిద్ధంగావున్నారు . పూజారులు మైక్ దగ్గర అసహనంగా కూర్చొనివున్నారు . కారణం పూజకిరావలసిన పెద్దమొత్తం చందాదారు లెవరో ఇంకా రాలేదుట . కాలాతీతానికి ప్రజలలో అసహనం పెరిగిపోతున్నాది . మధ్యమధ్యలో సమయం మించిపోతున్నందుకు గానూ, క్షమాపణలుచెప్పుతూ కార్యనిర్వాహకులు కాలయాపనచేస్తున్నారు .

రాత్రి 7.30 గంటలకు కొందరు భారీకాయులు కార్ల లోంచీదిగేరు కార్యనిర్వాహకులు వారి అడుగులకి,మడుగులొత్తుతూ , స్పెషల్ సీట్లమీద కూర్చోపెట్టీ, కూల్ డ్రింక్ లు ఇచ్చీ, పూజ ప్రారంభించ మని చెప్పగానే , పూజారులు సంకల్పమంత్రాలు ప్రారంభించేరు , కల్యాణ సమయం మించిపోయినా , స్వామి నిత్యకల్యాణుడు కనకా ముహూర్తంతో పనిలేదన్నతీర్పుతో.

అసహనంగా నిరీక్షిస్తున్న జనం '' హమ్మయ్య '' అని ఊపిరితీసుకున్నారు . అక్కడే స్వామివారి ప్రసాదంపేరుతో భోజనవసతి ఏర్పచడంతో జనం దండీగానేఉన్నారు . పూజ ప్రారంభమయ్యి పది నిముషాలుకూడా కాలేదు , ఒక్కనిముషం అంటూ కార్యనిర్వాహకసభ్యుడొకడు పూజారులతో ఏదోచెప్పేడు. పూజ ఆగింది . ఇందాకవచ్చినవారు తమభారీ శరీరాలని మోసుకుంటూ ష్టేజ్ పైకిఎక్కి నిలుచున్నారు . కార్య నిర్వాహకులు వారిని ,వారిచ్చినవిరాళాన్ని,గురించి పొగుడుతూ , వారికి స్వామివారి ఆశీర్వాదాలుగా శాలువకప్పి , గ్రూప్ ఫొటోలూ , వీడియో సెట్టింగులూ , వారిపేరుతో నామార్చనలతో ,మరింతకాలాతీతం చేసేరు . కిందకూర్చున్నవారికి చికాకుగాఉంది . తనివితీరా కల్యాణం చూద్దామనుకుంటే ఈ గొడవేమిటిరాబాబూ అనుకుం టూవుంటే , చిన్నపిల్లలు ఆకలికి, నిద్రకి ఏడుస్తూ మరింతచికాకు పుట్టిస్తున్నారు . భక్తిమీరినవారు ఆదేవదేవుడు మంగమ్మతల్లికి
కట్టే సూత్రాధారణకోసం సహనంగా ఎదురుచూస్తున్నారు .

ఒకపక్క ఆర్కెష్ట్రావారి పాటలు , మరోపక్క సన్నాయి వాద్యాల ఘోష , పిల్లలేడుపూ , వీటన్నిటిమధ్యా ఎవరో పెద్దలంటూ రావడం , మళ్లీ స్పీచ్ లూ , ఫొటోలూ , పొగడ్తలమధ్య స్వామివారి విగ్రహాలు మరుగై , కల్యాణం ఆగుతూ , ఆగుతూ మొత్తానికి పూర్తయ్యిందనిపించేరు .

పూజారులు హారతిని ఎత్తీ చూపడంతో , కల్యాణం పూర్తయ్యిందికాబోలను కొనీ ... ఆకలికి ఆగలేకా కొందరూ , ఐపోతాయేమోఅని కొందరూ భోజనాలలైనులోంచే చేతులూపేరు హారతితీసుకుంటున్నట్లు . ఖాళీగా వున్న స్టేజ్ మీద స్వామివారు మంగాసమేతుడై దర్సనం ఈయడానికి రెడీగాఉన్నా, అందరి దృష్టీ లైనులో తమకన్నా ముందున్నవారిమీదేవుంది ఎప్పుడుకదులు తారాఅనీ... గంటన్నరసేపు సాగినతోపులాటలో ఎవరికివారే తమవంతుకై వేగరపడుతున్నారు భోజనాలు మిగులుతాయో, లేదో అన్న బెంగతో... ఆకలి భక్తిని అధిగమించింది .

తిరిగీ మైక్ లోంచీ భాషణ ...డొనేషను ఇచ్చినవారి పేర్లు ,పొగడ్తలు , ఫొటోలమధ్య దిగ్విజయంగా సాగిన కార్యక్రమంలో, తాముపడిన శ్రమ గురించిన వివరణ . గ్రూప్ ఫొటోల మధ్య మరుగుపడిన విగ్రహాలని చూచే అవకాసం లేకా , తిరుగుముఖం పట్టేరు జనం . వారికి స్వామివారి కల్యాణం కి వచ్చినట్లులేదు . మంత్రాలు వినపడలేదు , విగ్రహాలు కనపడలేదు . అనవసరపు అలసటని ,కొని --------తెచ్చుకున్నట్లనిపించింది .

కార్యవర్గ సభ్యులకందరికీ ఒకటే ఆలోచన ...రేపటి న్యూస్ పేపరులో తమఫొటో వస్తుందా....రాదా ...వస్తే... తమగురించి ఏమని రాస్తారో......

భగవంతునికన్నా , మనిషికి ఇచ్చే విలువలనిచూచీ , '' ఆదేముని దయవల్లనే తాము, గానీ తమవల్ల దేముడు కాదుకదా...'' అటువంటి ఆ దేవుని పూజని మధ్యలోఆపి, తమని స్తుతింపజేసుకోవడం తమగొప్పలు చాటుకోవడం తప్పనితెలియదా....ఎవరికి తోచినంత వారు ఇచ్చేది , భగవంతునికోసమా....బడాయికోసమా ? తమ ఆధిక్యతని చాటుకోవడం అంత అవసరమా ? ....ఆదేవునిముందు అందరూ సమానులేననీ, తాము చేసే ప్రతీ మంచిపనికీ ఆ భగవంతుడు సత్ఫలితాలనే అందజేస్తాడనీ .....ఈరకంగా చాటుకోనవసరం లేదనీ....తెలియదా..? రూపాయిచ్చినవాడూ, కోట్లిచ్చినవాడూ ఇద్దరూ ఆదేవునికి సమానులేకదా....భక్తికి తలవంచే భగవంతునిముందా వీరి .....

ఆర్భాటాలు ...''.భక్తి , శ్రద్ధా , లోపించిన ఈతరం వారి పోకడలకు విచారిస్తూ ....ఆలోచనల మధ్య అడుగులేస్తూ ఇంటిదారి పడుతున్నారు వయోవృద్ధులు .

ఆ రెండు కళ్లు .

ఆ రెండు కళ్ళు .
*****
రెండేళ్ల గౌరిని ఎత్తుకొని ,ఆరు నెలల కన్నాని ఊయలలో ఊచుతూ ,మధ్య మధ్యలో కర్రలపొయ్యి ఊదుతూ, మండే కళ్లని మాటిమాటికి తుడుచుకుంటూ వంట చేస్తున్నాది సావిత్రి .బొగ్గులకుంపటి , కొయిలాపొయ్యి, కర్రలపొయ్యి , ఇల్లు, పిల్లలు, బట్టలు తకడం , అరమైలు పొడుగున్న వాకిలి చిమ్మి ముగ్గువేయడం , ఉదయం పదిగంటలలోపు వంటచేసి భర్తకి క్యేరేజి కట్టడం ఇవన్నీ చంకదిగని గౌరిని ,ఏడుపాపని కన్నాలని సముదాయిస్తూ అవలీలగా చేసుకుపోతున్నాది సావిత్రి.

పనిమనిషి రంగమ్మ గిన్నెలు తోముతూ'' ఈపిల్లలతో ఎలా చేస్తున్నావమ్మా, ఒకరు చంకదిగరు , ఒకరు ఏడుపాపరు '' అంటుంటే సావిత్రి నవ్వుతూ '' పిల్లలు కాక అల్లరి ఎవరు చేస్తారు రంగమ్మా. నాకా ఈ పిల్లలు , ఇల్లు తప్ప ఎక్కడికీ వెళ్ళే అలవాటుకూడా లేదు . అందికే వీళ్లతోడిదే లోకం నాకు. వీళ్లిద్దరూ నారెండు కళ్ళనుకో . వీళ్లతో నాకేబాధా లేదుగానీ నువు తొందరగా పని కానీ , బాబుగారికి టైం అవుతున్నాది ...అంటూ అష్థావధానం చేస్తూనే వంట ముగించి , భర్తకి , అత్త,మామలకి ,కాఫీ,ఫలహారాలు ,ఇచ్చీ, భర్తకి క్యేరేజి చేతికి అందించింది . హడావిడిగా బయలుదేరుతున్న భర్తని గేటుదాకా సాగనంపి తిరిగి పనిలోలీనం అయ్యింది .

పధ్నాలుగు సం '' నిండక ముందే పెళ్లయిన సావిత్రి 18 సం '' వచ్చేసరికి యిద్దరు పిల్లలకి తల్లయ్యింది. చిన్న పల్లెటూరిలో ఎ. ఎస్ . ఎం . గా పనిచేస్తున్న రావుగారికి అన్నివిధాలా సహకరిస్తూ అత్త,మామల సేవలూ , ఆడబిడ్డల అచ్చట్లూ, పిల్లల ముచ్చట్ల్ల మధ్య , బాధ్యత నిండిన బరువుతో , పనిచేసే మరబొమ్మలా తయారయ్యింది .

పొద్దున్నే లేచి దుంగల్లాఉన్న కర్రలు సన్నగా నరకడం , రాక్షసి బొగ్గులు చిన్నవిగా కొట్టడం , మామగారిపూజకి పూలు సిద్ధంచేయడం , పిల్లలకి స్నానం చేయించి , భర్త బట్టలు ఇస్థ్థ్రీ చేసి , టిఫిను, కాఫీలని అందించీ వంటలో జొరబడడం .....నిముషమైనా ఖాళీలేని పనులమధ్య పిల్లల ఆటలు , అల్లర్లూ ,ముద్దుమాటల మధ్య తనచిన్ని ప్రపంచాన్ని అల్లుకుపోయింది సావిత్రి . ఆ పిల్లలంటే ప్రాణం సావిత్రికి .వాళ్లకి ఏ చిన్నదెబ్బ తగలినా విలవిలలాడిపోయేది .

క్షణతీరిక లేకుండానే ఇరవై యేళ్లు గ డిచిపోయాయి. నడివయసుదాటిన సావిత్రి పనిభారంతో అలసిపోయింది . అందమైన ముఖం కమిలి వాడిపొయింది. కళ్లకింద నల్లటిచారలు ఏర్పడ్దాయి . ఈమధ్య తరచుగా నడుములో విపరీతంగా నొప్పి వస్తున్నాది . పని కష్థంగాఉంది . వయసు వచ్చినా గౌరికి తన స్నేహితులు, ఆటపాటలు , తప్ప , తల్లిబాధ గమనించే సమయం ఉండేదికాదు. షిఫ్ట్ డ్యూటీలతో , నిద్ర సమంగాలేని భర్తకు ఈ విషయంచెప్పి విసిగించదలచుకోలేదు సావిత్రి . బాధని దిగమింగుకుంటూ భారంగా పనులు చేసుకుపోతున్నాది . ఇంతబాధలోనీ పిల్లలు కళకళలాడుతూ స్నేహితులతో ఆడుతూ పాడుతూ ,మధ్యమధ్యలో చిన్ని,చిన్ని తగవులుతీర్చమని దగ్గరకి వచ్చినపుడు ఆమె అదొకరకమైన ఆనందాన్నిం అనుభవించేది . వీళ్లు నాప్రాణాలు . వీళ్ల భవిష్యత్తు ఉజ్వలంగాఉండాలంటే తనబాధలు వాళ్లకి తెలియనివ్వకోడదు అనుకున్నాది .

ఎవరికీ తనబాధని చెప్పనిసావిత్రి యాంత్రికంగా తనపనులు చేసుకుపోతున్నాది . కాలం గడుస్తున్నకొలదీ నీర్సం ,తలనొప్పి, నిస్సత్తువలమధ్య గౌరి పెళ్లి , తర్వాత , పండగలూ , పురుళ్లతో సావిత్రి కండలు కరిగిపోయాయి. అయినాసరే ఆ మొఖం లో చిరునవ్వు చెదరలేదు . మనవల ఆటపాటలమధ్య తన బాధని తాత్కాలికంగా మర్చిపోడానికి ప్రయత్నిస్తూనే, ఇంటిపనులు చేసుకుపోతున్నాది .భర్తతోపాటు ,ఉద్యోగస్తుడైన కన్నాకికూడా క్యేరేజి కట్టవలసి రావడంతో తెల్లారి మూడుగంటలకే లేచి పనులు చేయవలసివస్తున్నాది సావిత్రికి . హడావిడిగా చేస్తున్న పనులతొందరలో నీళ్లుమోస్తూ కాలుజారిపడింది . ఆసుపత్రి , మందులు , ఫ్రాక్చర్ , ఆరునెలల రెష్థ్ , తర్వాత చేతికర్రలిచ్చి ఇంటికి పంపారు డాక్టర్లు. సంవత్సరం వరకు కర్రలతో నానాబధా పడి నలిగిన సావిత్రికి సాయంగా కొన్ని రోజులపాటు గౌరినిరమ్మని కోరిన రావుగారికి '' తనకి తీరదని , వాళ్లాయనకి సెలవులేదని రాసిన గౌరిజవాబుకి నిరాసచెందారు . కళ్లల్లో నీళ్లు చిమ్మేయి ''.కూతురు వస్తుంది , తనని జాగ్రత్తగా చూసుకుంటుంది . కొన్నాళ్లపాటు తనకి విస్రాంతి దొరుకుతుందని '' ఆశగా చూసే సావిత్రికి ఏంచెప్పాలో తెలీలేదు . భర్త ముఖకవలికలబట్టీ విషయాన్ని గ్రహించిన సావిత్రి మనసు బాధగా మూల్గింది . వెంఠనే కోల్కొనీ '' పసిపిల్ల , సంసారమంటే మాటలా ....అది ఎంతబాధపడుతూ అలా రాసిందో .. అసలు మీరు పిల్లకెందుకురాసారు '' అంటూ మందలించింది . ఎన్ని మందులు వాడినా, సావిత్రి తొందరగా కోలుకోలేకపోయింది .సావిత్రిలో వచ్చిన మార్పుని వయసుతెచ్చిన మార్పుగా తీర్పునిస్తూ ,నిర్లక్ష్యగా మట్లాడుతున్న కుటుంబసభ్యులని విస్తుపోయి చూడడంతప్ప ,ఏమీ చేయలేకపొయింది .తనబాధని ఎవరితోనూ చెప్పుకోలేకా సతమతమయ్యే పనులు ఒంటరిగా చేసుకోలేకా ,కాలం కాటుని భరిస్తూ , కన్నా పెళ్లి కూడా చేసింది . కోడలిరాక తర్వాత కొన్నిరోజులుబాగున్నా రానురానూ ముళ్లపోటయ్యింది .కోడలివిసుగు , చీదరింపులమధ్య ,మానసికంగా చితికిపోయింది . మూడువంతులపని తనుచేస్తున్నా ,రిటైర్ అయిన భర్త పెనషను వాళ్ల జల్సాలకి , ఖర్చులకి ఇస్తున్నా బతుకు భారమయ్యింది . కోడలి సూటీపోటీ మాటలు , నిష్థ్థూరాలూ మనసుని గాయపరుస్తూ ఉంటే , సావిత్రి సహనానికి కన్నగాడి మాటలు ఆ గాయానికి కారం పూసినట్లుండేవి . భార్య మాటలునమ్మి ,ఆమెను సమర్ధిస్తూ చేసిన రాద్ధాంతాలతో ఇల్లు నరకం అయేది .
భార్యని సమర్ధించడం , తమని కించపరచడం రోజూవారి కార్యక్రమం అయ్యింది . కొడుకుకి ఉద్యోగరీత్యా బదిలీరావడంతో రావుగారు ,తేలికగా ఊపిరితీసుకుంటే, తల్లిగా సావిత్రి గుండె బరువెక్కింది . కొత్త ఊరిలో చంటి పిల్లలతో , ఏం బాధపడతాడోనని మనసు బాధగామూల్గింది .కొడుకు వెళ్లిపోయాకా సావిత్రి మరీ వంటరిదయ్యింది . పిల్లలు, మనవల `జ్నాపకాలతో కళ్లు తడైయ్యేవి . శరీరపు వివసత్వం , మానసికపు వత్తిడి ఆమెనుబాగా కుంగదీసాయి . మూసిన కళ్లముందు తన చిన్ననాటి సంఘటనలు , తండ్రి వదిలేసిన తల్లి దీనస్థ్థితి , బీదరికం , అక్కచెల్లెళ్ల అవమానాలు, అగచాట్లు , తమపెళ్లికోసం తల్లిపడిన పాట్లు ,సినిమారీళ్లలా కదిలాయి. అక్కకాపరం నిలబెట్టడానికి తన తల్లి పడిన అగచాట్లు , మగదిక్కులేని సంసారపు నిస్సహాయత, డబ్బులేని బెంగ , పసితనం వీడని చేల్లెలి కాయకష్థ్థం ,తన అందమే తన శత్రువై నిలిచిన వైనం గుర్తుకువచ్చి గుండెలోతుల్లో కలుక్కు మంటున్నాది. కన్నీరు ధారాపాతంగా కారుతున్నాది . ఆ కన్నీటి మధ్య ఆనాటి రావుగారిరూపం ,తనని పెళ్లిచేసుకుంటాననడం , తల్లి ఆనందం అన్నీ రెపరెపలాడేయి . కానీ కట్నం లేకుండా తనని పెళ్లి చేసుకున్న రావుగారు భగవంతునిలా తోచేరు . అత్తారింటికి బయలుదేరుతున్న తనతో '' కష్థం ,అయినా, సుఖం అయినా భరించీ జాగ్రత్తగా కాపరంచేసుకోమనీ , అండలేనివాళ్లం కనక అణిగి,మణిగి ఉండమనీ కన్నీటితో వీడ్కోలు చెప్పిన తల్లిరూపం దీనంగా కనిపిస్తున్నాది . ఆమాటమీదే ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని సంసారం నెట్టుకొచ్చింది . భర్తని ఏనాడూ ఇది కావాలని అడగలేదు . బయటకు వెళితే ఖర్చని ఇల్లే స్వర్గం ,పిల్లలేలోకంగా బతికింది .

తనకి జీవితాన్నిచ్చిన భర్తమీద గౌరవం ,కృతజ్నతలతో, తనకివచ్చిన ఏకష్థం అతనికి చెప్పేదికాదు . తనపిల్లలు పెద్దయితే వాళ్లే తనని చూసుకుంటారు . తనమనసు తెలుసుకొని తను అడగకుండానే తనకుకావలసినవి చేస్తారన్న నమ్మకం వమ్మయ్యింది . మానసికపు క్షోభకి మందులేదు . సావిత్రి పరిస్తితి రోజురోజుకీ దిగజారితున్నాది .

రోజూ తెల్లారే లేచే సావిత్రి పొద్దున్న ఏడైనా లేవకపొయేసరికి రావుగారికి భయం వేసింది .దగ్గరగావెళ్లిచూసేరు . సావిత్రి శరీరం వేడిగాఉంది . తెల్లటి శరీరం కమిలిపోయింది . మనిషి బాగా సన్నబడింది . కళ్లలోని నిస్పృహ , ఉబ్బిన పొట్ట ...ఇదేంటీ... ఈమె తన సావిత్రేనా... ఎంత అందమైనది , ఎలాగైపొయిందీ... రావుగారి కళ్లలోనీళ్లు తిరిగాయి . బాధ్యతల పరుగులో తను సావిత్రిని ఎంత నిర్లక్ష్యం చేసేడో అర్ధం అయ్యింది . ఏంచెయ్యాలో తోచక పిల్లలిద్దరికీ తెలియజేసేరు . కానీ చిత్రం . ఏ స్పందనాలేని జవాబు .తమకి కుదరదంటూ. ఏవేవో కారణాలు .


సావిత్రి జీవితం లో ఆసుపత్రి , మందులు , ఒక భాగంగా మారేయి . పనిచేయడానికి కూడా లేవలేని సావిత్రిని చూసుకుంటూ, ఒంటరిగా ఆమెని వదిలి , బయటి పనులుచేసుకొలేకా సతమతమయ్యిన రావుగారు కొడుకుదగ్గరకు వెళ్లిపోదామన్న ఆలోచనతో్, పరిస్థితులు వివరిస్తూ రాసిన ఉత్తరానికి జవాబుగా , తమ ఇల్లు చాలాచిన్నదనీ , మరో ఇద్దరు వస్తే ఆర్ధికంగాకూడా ఇబ్బందనీ , పెద్దఇంటికి అద్దె చెల్లించే స్తోమత తనకు లేదన్న కొడుకు జాబు గొడ్డలిపెట్టయ్యింది .
ఆలోచించగా తన పి. ఎఫ్ డబ్బుతో ఒక ఇల్లు కొంటే , ఏమీలేని తమని కోడలు సమంగా చూస్తుందా ...అన్న ఆలోచన, భార్యనే సమర్ధించే గుణమున్న కొడుకు నైజం , తర్జన,భర్జనల రూపమెత్తి , వృద్దాప్యపు బరువు చివరికి వాత్సల్యానికి ఓటు వేసింది . కన్నాపేరుమీద పి.ఎఫ్ ట్రాంస్ఫర్ అయ్యింది .ఇల్లు కొనడం , మారడం ,అన్నీ అయినా కన్నానుంచీ పిలుపురాలేదు .

ఇక్కడ పనిచేసుకోలేక , డబ్బుచాలక , మందులకి , టెష్థులకి , బేంక్ బేలంస్ లేకా రావుగారు నానాఅవస్తలూ పడుతున్నారు , కన్నా పిలుపుకోసం ఎదురుచూస్తూ...అన్నీ ఎరిగిన సావిత్రి విరక్తిగా నవ్వుకున్నాది . కానీ కన్నపిల్లలపట్ల ఆమె ప్రేమ చెక్కు చెదరలేదు . గౌరికి వచ్చిన విష జ్వరం తగ్గడానికి ఆమెచేసిన ఉపవాసాలూ, కన్న ఆర్ధిక పరిస్థ్థితి మెరుగుపడాలని ఆమెచేసిన చన్నీటి స్నానాలూ ఆమె ఒంటిని మరింత గుల్లచేసాయి . ఆమె పూర్తిగా మంచానికి బానిసయ్యింది .

మొట్టమొదటిసారిగా సావిత్రి పిల్లల పిలుపుకై ఎదురుచూసింది , భర్త బాధ చూడలేకా .... పిల్లలదగ్గరకు వెళ్లిపోదామన్న మాటను చిరు నవ్వుతో తోసిపుచ్చే సావిత్రి , ఒకరోజు హఠాత్తుగా కొదుకుదగ్గరకు వెళదామనడంతో , అన్నదే తడవుగా ప్రయాణానికి సిద్ధం అయ్యేరు .

అత్త,మామల రాక కంట్లో నలుసయ్యింది కోడలికి . భర్తతో పోరీ, పోరీ వేరే అద్దెఇంటిలో దింపింది . సావిత్రి, రావుగార్లలకి నోట మాట రాలేదు. గుట్టెరిగిన సావిత్రి మౌనంగా కన్నీరు కార్చింది .తిరిగి చాకిరీ , ఒంట, తప్పలేదు ఇద్దరికీ. ఈ కష్థం లోనే చిన్ని సంతోషం . కొడుకు , మనుమలు దగ్గరగా ఉన్నారు కదా అని . మనుమల ఆట,పాటలతో కొంతవరకు బాధని మర్చిపోగలిగింది . మర్మమెరుగని మనుమల కోరికలు తీర్చేందికు, చిరు వంటలు చేయడానికి ప్రయత్నిస్తున్న సావిత్రి ,ఒకరోజు పనిచేస్తూ కుప్పకూలింది . తిరిగి లేవలేని సావిత్రి ఆసుపత్రిలో పదిరోజుల పోరాటం అనంతరం , డాక్టర్ లు సావిత్రి జీవితాన్ని కొన్నిరోజుల కొలబద్దతో ముడిపెట్టి వెళ్లిపోయారు .

కొన్నిరోజులంటే వారాలా, నెలలా సం వత్సరాలా..? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. కానీ ఈ పరిస్థితిలో ఈమెకు ఎవరు సేవలు చేస్తారు ?

కొడుకు బాధ్యత తీసుకోకపోతే తను ఈ వయసులో ఏం చెయ్యగుడు ? చేసినా ఎన్నాళ్లు ....రావుగారి ఆలోచన .......

చచ్చాం | ఇంక ఈవిడగారి సేవతోనే తన జీవితంకాబోలు ..తొందరగా తేల్చు భగవంతుడా...కోడలి కోరిక ....

ఇప్పటికే వచ్చీ పదిహేను రోజులయ్యింది మరదలి వ్వవహారం చూస్తే ,అమ్మని చూసినట్టు లేదు ..తనుమాత్రం ఎన్నాళ్లు ఉండగలదు ..? కూతురి తర్జన, భర్జన......

ఎన్నాళ్లు ఉంటుందో తెలీని పరిస్తితులలో ఈ ఆసుపత్రి ఖర్చులు తను భరించగలడా....మధ్యతరగతి .కొడుకు సంఘర్షణ .....

ఇవన్నీ కలిపీ , అందరి స్వార్ధపు ఆలోచనలసారం ...'' భగవంతుడా...ఈమెని తొందరగా తీసుకుపో ''...........

ఇవేవీ తెలీని సావిత్రి కళ్లలో కొత్తకాంతి . తనకు బాగులేదనగానే కూతురు పరుగెత్తుకు వచ్చింది . కొడుకు నీళ్లలా డబ్బులు ఖర్చు చేస్తున్నాడు . భర్త పదే పదే భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాడు . ఎంతైనా నా పిల్లలు నాపిల్లలే . నా రెండు కళ్లు . నా ఊపిరి . సావిత్రి సంత్రుప్తిగా కళ్లుమూసుకుంది .

సావిత్రి కళ్లుమూసిన ప్రతీసారీ అందరిలో వచ్చిన ఒకేఒక ఆలోచన ...నిద్రా...నిష్ర్క్రమణా ....

ప్రతీరోజూ అందరి ఎదురుచూపులూ తోసిపుచ్చీ కళ్లుతెరిచిన సావిత్రిని ఉస్సురంటూ చూసేవారు . అందరిమధ్యా వాదోపవాదాలే....చాకిరీగురించి , ఖర్చులగురించి, .....

ప్రతిఒక్కరూ మర్చిపోయారు ఆమె తమకోసం ఎంత శ్రమపడిందనీ.....ఈనాటి ఆమె పరిస్థితికి కారకులు తామేనని . రక్తసంబంధం రిక్తసంబంధం అయ్యింది .ఆదుకోవలసిన క్షణంలో అసహనాన్ని కనపరుస్తున్నారు కావలసినవారంతా......

భర్త, పిల్లల మొహాలలో అసహనాన్ని ,విసుగుని లీలగా గుర్తించిన సావిత్రి చిన్నగా నవ్వుకుంది . మంచం పట్టినవారిని ఎవరుమాత్రం ఎంతకాలం చూడగలరు . బతికున్నన్నాళ్లు తనపనితాను చేసుకున్నాది . ఇంక ఎవరిమీదా ఆధారపడడం తనకిష్థం లేదు . '' భగవంతుడా...తొందరగా నన్ను తీసుకుపో ....అలసిపోయాను ప్రభూ .......నాపిల్లలని కష్థపెట్టకు .నా ఎదురుగా వాళ్లు ఏప్పుడూ సంతోషంగా ఉండాలి . నాగురించి వారిని ఇబ్బంది పెట్టకుతండ్రీ....మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్ధించింది .

కళ్లుతెరిచి చుట్టూ చూసింది . భర్త , కూతురు . కొడుకు కోడలు , మనుమలు , .....కాంతిహీనమైనకళ్లతో సంత్రుప్తిగా అందరినీచూసింది . అలా చూస్తూనేఉంది ..

ఆకళ్లు తిరిగి మూసుకోలేదు .అందరినీ తనివితీరా చూసిన ఆనందం తట్టుకోలేని ఆమె గుండె చప్పుడు కాకుండా జారుకుంది . విప్పారిన ఆరెండుకళ్లలో గౌరీ, కన్నల ప్రతిరూపాలు అస్పష్థంగా కనిపిస్తున్నాయి .
అన్ని బంధాలూ తెంచుకొని ఆమె ఆత్మ ఆశీర్వాదాల ఆస్తినొదిలి అందరానిలోకాలకు పయనమయ్యింది.

ఎక్కడనుంచో '' అనుబంధం , ఆప్యాయత అంతా ఒక బూటకం , ఆత్మశుద్ధికై మనుషులు ఆడుకొనే నాటకం '' అనే పాట ,అపశృతిలా విని పిస్తున్నాది, రేపటి మీ పరిస్తితి కూడా యింతే , అన్నట్లుగా...........
-----------------------------

విలువలు.

విలువలు.
*****

రాత్రి రెండు గంటలు అవుతున్నాది . దించిన తల ఎత్తకుండా బొమ్మలు చేస్తున్నాడు వీరన్న . రెండు రోజులలో బ్రహ్మొత్స్వాలు ప్రారంభం అవబోతున్నాయి .

కులదైవంఐన శ్రీ వేంకటేశ్వరుని వైభవోపేతంగా అలంకరించి జరిపే ఉత్సవాలకి కోట్లకొలదీ వచ్చే జనం , ఈ దేవుని బొమ్మలని , విగ్రహాలని భక్తితో కొని తీసుకువెళతారు . ఈ రెండురోజులూ కష్థపడి మరిన్ని బొమ్మలు చేయగలిస్తే నెల్లాళ్లపాటు తిండిగింజలకి లోటు ఉండదు . ఆలోచిస్తూనే తలెత్తీ యధాలాపంగా చూసేడు వీరన్న .

భార్య మాలచ్చిమి బంకమట్టిని కలిపి , కలిపి ఆ మట్టికొట్టిన చీరతోనే అలసటగా పడుక్కున్నాది . కోడలు రంగి నేడో రేపో ప్రసవించేట్టు ఉంది . బరువుగా కనులు మూసుకొని చిన్నగా మూలుగుతున్నాది. ఎనిమిది సంవత్సరాల మనుమడు సిన్నోడి చిన్నారి చేతులు రంగులు కలిపీ, కలిపీ చిదిమిపోయాయి . చేతికి రాసిన ఆవనూని తుండుగుడ్డమీద మరకలుగా తేలింది . అలసిన సిన్నోడు ఆదమరచి నిద్రపోతున్నాడు .

నిద్రరానిదల్లా వీరన్నకే. ప్రతీఏడూ ఏదోఒక ఉత్సవం జరగడం తనుకాక ఆ చుట్టుపక్కలవాళ్లు కూడా ఈ బొమ్మలమీదే ఆధారపడి ఉండడంతో పోటీలుగా బొమ్మలు తీర్చడం , రంగులు పూసి బారులుగా ఎండబెట్టడం , అమ్మకానికి సిద్ధం అయినవాటిని దొంతులుగా కట్టి , వాటిని దుకాణాలకి అమ్మడం పరిపాటి. వారి ఒప్పందం ప్రకారం బొమ్మకి 15 రూ'' మించి రాదు . అదేబొమ్మ దుకాణం లో 200 కి తక్కువ అమ్మరు .

ఈరకమైన ఉత్సవాల్లో గిరాకీ బాగానే ఉంటుంది . కానీ శ్రమకి తగ్గ ఫలితం రాని కారణంగా గూడెం వారిని బీదరికపుచాయలు వదిలిపోవడం లేదు . ఈసారి మాత్రం తను పాతికకి ఒక్కరూపాయి కూడా తగ్గేదిలేదు .మూడు నెలలక్రితం " ఈ బొమ్మలవల్ల తమసంసారం గడవదు ,పట్నం వెళ్లి కూలడబ్బులు తెస్తా" నంటూ వెళ్లిన కొడుకు తిరిగిరాలేదు .భార్య, మనుమడితోపాటు కోడలి పురిటిఖర్చు కూడా తనమీద పడడంతో వీరన్నకి నిద్రకరువైయ్యింది .

మొన్న గర్భగుడి పూజారిగారు వచ్చి మూడడుగుల మట్టి విగ్రహాన్ని మలచమని , ఎవరో పెద్దలు స్వామివారి కల్యాణం చేయించుకొని ఆ విగ్రహాన్ని తమతో తీసుకువెళ్తారని ,డబ్బుకూడా బాగానే్ ఇస్తారని చెప్పడంతో , ఆశగా మట్టివిగ్రహానికి శ్రీకారం చుట్టేడు .

విగ్రహం తయ్యారయ్యింది . రంగులకలయిక అద్భుతంగా కుదిరింది. అందమైనవిగ్రహాన్ని అపురూపంగాచూస్తూ జాగ్రత్తగా వారగా పెట్టేడు . రేపు సేఠ్ యిచ్చిన డబ్బులతో కోడలిని ఆసుపత్రిలో చేర్పిస్తాడు . పుట్టబోయే బిడ్డకి మెత్తటి ఊయల కొంటాడు . మాలచ్చింకి పూల రవికెలు కొంటాడు .
ఎవేవో లోకాల్లో విహరిస్తున్న వీరన్న సేఠ్ ని తీసుకొని పూజారిగారు రావడంతో ఈ లోకంలోకి వచ్చేడు . 500 అయినా ముడుతుందనుకున్న విగ్రహం వెల 125 / రూ'' భారంగా ముగిసింది .

*****


చేసిన బొమ్మలు అమ్మకానికి పోనేలేదు. కోడలికి పురిటినొప్పులు ప్రారంభం అయ్యేయి . దిక్కుతోచని వీరన్న మంత్రసానికోసం పరుగెత్తాడు . పురిటినొప్పులతో వేసే కోడలి కేకలకి చెట్టుమీదున్న కాకులు చెల్లాచెదురయ్యాయి .
*****

గుడిలో వీరన్నచేసిన విగ్రహానికి బంగారునగలతో అలంకరణ చేసేరు . స్వామివారి నివేదనకు పంచభక్ష్యాది పానీయాలను సిద్ధంచేసారు .రవ్వలుపొదిగిన బంగారుభరణాలతో స్వామివారి విగ్రహం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాది . ఏడువారాలనగలతో బరువెక్కిన విగ్రహంతోపాటు , భారీకాయాల పూజారులను,పల్లకిలో మోస్తున్నారు నలుగురు బక్కచిక్కిన బడుగు ప్రాణులు . ఊరేగింపు తర్వాత దొరికే 10/ రూపాయలతోపాటు సేఠ్ పెట్టే తిండికోసం .

*****

వీరన్న కోడలికి కానుపు కష్థం అయ్యింది పట్నం తీసుకువెళ్లే స్తోమతలేని వీరన్న, మాలచ్చిమి భోరున విలపిస్తున్నారు, కనపడని దేవుణ్ణి ప్రార్ధిస్థూ . మంత్రసాని బిడ్డ అడ్డంతిరిగిందని చెప్పిన మాట సమ్మెటపోటయ్యింది వీరన్న దంపతులకు. దిక్కుతోచని స్థితిలో , కూరగాయలమ్మే మల్లన్న తోపుడుబండిలో కోడలిని వేసుకొని మైళ్లదూరంలో ఉన్న పట్టణానికి పరుగుతుసేరు వీరన్న దంపతులు .

నడినెత్తిమీద ఎండ, చెప్పులులేని కాళ్లు, కాలే కడుపు, డబ్బులేని బతుకులతో చెడుగుడటలాడుకుంటున్నాయి . బరువుగా బండిలాగుతున్న వీరన్నకి ఊరేగింపు ఎదురయ్యింది .జనం, జనం, జనం. ,గోవిందనామాల హొరు తప్పించుకొని తొందరగావెళ్లాలని '' జరగండెహె '', అంటూ అరుస్తూ అప్రయత్నంగా తలెత్తిన వీరన్నకి , తనుచేసిన స్వామివిగ్రహం సర్వాలంకరణలతో కళకళలాడుతూ కనిపించింది . మనస్సులో ఆనందకెరటం ఉవ్వెత్తునలేచింది . సామీ అంటూ భక్తిగా నమస్కరించేడు . ఊరేగింపుకి అడ్డంగాఉన్న వీరన్నని బండితోసహా ఎవరో ఒక్కతోపు తోసేరు .నొప్పులతో అరుస్తున్న వీరన్నకోడలి అరుపులు గోవిందనామాల గోలలొ కొట్టుకుపోయాయి. ప్రాణమున్న మనిషికాన్నా, ప్రాణం లేని విగ్రహానికి భక్తిపేరుతో '' విలువలు '' కట్టీ , గొర్రెలమందలా తరలిపోతున్నారు జనం . తనుచేసిన ప్రాణమున్న బొమ్మల మూర్ఖత్వానికి మారుమాటరాని దేముడు , వీరన్నకి వచ్చిన కష్థానికి చేయూతనిచ్చే సమయం తనకికూడా లేదన్నట్లు బంగారుపల్లకీలో గుంభనంగా, గంభీరంగా తరలిపోతున్నుడు . పక్కనుండీ వీరన్న తోపుడు బండి బరువుగా కదిలింది .
*****

స్వామివారి కల్యాణం మొదలయ్యింది .దేదీప్యమానంగా అలంకరించబడ్డ పందిరిలో స్వామివారు మంగమ్మలకు నవరత్నాల తలంబ్రాలు పోస్తున్నారు . భక్తులంతా చల్లటిపానీయాలు తాగుతూ ,సేఠ్ జీని కొనియాడుతున్నారు .దర్పంగా కూర్చున్న సేఠ్ , అడుగులకి మడుగులొత్తుతున్నారు పూజారులు .తమకికూడా దండీగా దక్షిణ మట్టవచ్చన్న ఆశతో.

*****

ఊరేగింపురద్దీలో అరగంట ఆలస్యంగా మునిసిపల్ ఆసుపత్రి చేరాడు వీరన్న . స్పృ హ తప్పబోతున్న కోడలిని మోస్తూ లోనికి తీసుకువెళ్లేరు .
ఖాళీల్లేకా వరండాలసైతం నిండిఉన్నారు రోగులు. డాక్టర్ రాని కారణంగా గంతలతరబడీ నిరీక్షిస్తున్న రోగులు వీరన్న పరిస్థితిచూసీ నిట్టూర్పు వదిలేరు . పురిటినొప్పులకి తాళలేని కొడలిని ఒక్కసారి చూడమని దైన్యంగా బతిమాలుతున్నాది మాలచ్చిమి నర్సులని . కోడలి గొంతుక తడారడంతో సోడా తేవడానికి పరుగెత్తాడు వీరన్న , గుక్కెడు నీళ్లుకూడారాని మునిసిపల్ కొళాయిని తిట్టుకుంటూ .

*****

స్వామివారిపై మంగళ స్నానాది, అభిషేకాలపేరుతో పాలు, నీరు ,పెరుగు, తేనె, ఏరులై పారుతున్నాయి. భజంత్రీల ఘోష ఆకాసాన్నంటుతున్నాది . అక్షతలు , పూలూ జల్లుగా కురుస్తున్నాయి స్వామిమీద .

పెళ్లికొడుకుగా స్వామి ప్రత్యేకదర్సనం యిస్తున్నారు వి .ఐ . పి . లకి . నోట్లకట్టలు చేతులు మారుతున్నాయి . ఫలితం... స్వామి వారి గర్భగుడిలోకి కొన్ని గంటలనుంచీ , లక్షలకొలదీ నిలుచున్న జనం లైనులో మొదటి వారుగా పంపబడుతున్నారు .

*****

కొన్ని గంటలతర్వాత వచ్చిన డాక్టరుని కాళ్లా వేళ్లా పడి బతిమాలుతున్నారు వీరన్న దంపతులు .'' కేసు క్రిటికల్ కండీషనులో ఉంది కనకా ఆపరేషనుకి ,టెక్టులకి ఖర్చవుతుందనీ, దబ్బుతేవకుంటే పనికాదని, '' ఖచ్చితంగా చెపుతున్న మాటలు విని నీరుకారిపోయాడు వీరన్న. దేముడా అంటూ కూలబడ్డాడు. అతని కళ్లముందు తను మలచిన స్వామి విగ్రహాలు వలయాల్లా తిరుగుతున్నాయి. ఈరోజుకి తనని ఆదుకుంటుంనుకున్న మట్టివిగ్రహం మాధవుడి రూపం లో మంగళహారతులందుకుంటున్నాది .ఏ రూపాన్ని తను బతుకుతెరువుగా ఎంచుకున్నాడో , ఆ దేవుడు తనని ఏనాడూ కరుణించలేదు.

అయినా తను ఏనాడూ బాధపదలేదు .అంతా తన ఖర్మ అనుకున్నాడు.ఇప్పుడు కనీసం 500/ అయినా ఉంటేగానీ కోడలి పరిస్థ్థితి కుదుటపడినట్లు లేదు.తన దగ్గర 80/ రూ| మించీ లేదు. ఆకలికి పేగులు చుట్టుకు పోతున్నాయి . ఆకలని చెప్పలేకా ముడుచుకొని కూర్చుంది మాలచ్చిమి బేలగా. ఈరోజయినా ఏ దేముడైనా కరుణించీ , డాక్తర్ బాబు రూపం లొ వచ్చి కోడలి పురుడు సవ్యంగా జరిపిస్తాడేమోనని ఆశగా చూడడంతప్ప ఏమీ చేయలేకపోయాడు వీరన్న. నిస్త్ర్రాణగా కూలబడ్డాడు వెలసనగోడలకానుకొని .

*****

విందుభోజనాలతో స్వామివారి కల్యాణం పూర్తయ్యింది . బ్రేవ్ మన్న త్రేనుపులతో మండపం ప్రతిధ్వనిస్తున్నాది . పెళ్ళిలో అలసిన స్వామివారి జంటని ఉయ్యాలలో సేదతీరుస్తున్నారు పూజారులు. అలసిన స్వామి మంగాసమేతుడై చిద్విలాసంగా నిద్రిస్తున్నాడు , తనకేంపట్టనట్టు .

*****

నొప్పులు ఎక్కువైన వీరన్న కోడలిచుట్టూ అక్కడి ఆడవారంతా మూగేరు . అరగంట యాతన తర్వాత బిడ్డ బయటపడింది . వీరన్న కోడలు అలసటగా మూసిన కళ్ళు తిరిగి విప్పలేదు .

పుట్టిన ఐదినిముషాలలోనే చారెడు కళ్ళు విప్పి చుట్టూ చూసింది పురిటికందు .తనేదో ఈ ప్రపంచం లో బావుకుందామన్న ఆశతో

కళాపొషణ.

Kalapooshana

'' సంగీతనిలయం '' అన్న బోర్డ్ ని తదేకంగా చూస్తూ ఆప్యాయంగా తడుముతున్నారు రాఘవరావుగారు . అది తమ వంశపారంపర్యంగా వస్తున్న సంగీత రాగనిధికి నిదర్శనం . తమ తాత, ముత్తాతల నుంచీ అందరూ సంగీతకోవిదులే. ఆ తరం కళలకిచ్చే గౌరవాలే వేరు . ప్రతీఇంటా లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఉండేది . తెల్లారితే సుప్రభాతం , వేద పారాయణ పఠనం వినిపిస్తూ ఉండేది .చాలాఇళ్లల్లో సంగీతసాధన మొదలైయ్యేది . శ్రావ్యమైన కంఠాలతో పిల్లలు పాడుతూఉంటే , స్నానాది ,సూర్యనమస్కారాలు ఆచరించడానికి చెరువులకు వెళ్లేవారికి వీనులవిందయ్యేది . అప్పటి వాతావరణంలో పెరిగిన పిల్లలందరికీ సంగీత, సాహిత్యాలలో ఒకరినిమించి ఒకరు రాణించాలన్న తపన, పట్టుదల ఉండేవి. అటువంటి వారిలో తనూ ఒకడిగా తాతగారిదగ్గర నేర్చుకున్న సంగీతం తన గళానికే వన్నెతెచ్చింది . సాదరమైన ఆహ్వానాలు , సన్మాలమధ్య , '' సంగీత కళా తపస్వి '' అన్న బిరుదు
మరింత కీర్తిని తెచ్చిపెట్టింది .

తాతదగ్గరే తను పెరిగేడు . తనని కన్న నాలుగేళ్లకే తల్లి కన్నుమూసింది .తండ్రి ఉన్నా లేనట్టే. తనని పట్టించుకున్నవారే లేని సమయంలో తాత చేయూత, అమ్మమ్మ ఆప్యాయతా తనని సాంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దేయి .

తాతయ్య క్రమశిక్షణకి ప్రాధాన్యమిచ్చే మనిషి . వంశపారంపర్యంగా వస్తున్న సంగీతాన్ని సాధన చేస్తూ , పల్లెలోఉన్న చాలామంది పిల్లలకు సంగీతగురువైన తాతయ్యకు , తాను ప్రియశుష్యుడ య్యేడు . రాగం, తానం, ఆలాపన, స్వరకల్పనల మధు రసాలు తనలో వయసుతోపాటు వృద్ధిచెందుతూ వచ్చేయి .

ఆ ఆనందం , సంగీతం పట్ల ప్రజలు చూపించే గౌరవం , సంగీతసభల సుగంధాలు తనలో జీర్ణించుకుపోయాయి . కాలం , కాలంతో పాటు వయసుతెచ్చిన వృద్ధాప్యం తన గొంతుమీద దాడిచేసాయి . ఊపిరినిలిపి పాడడం కష్థం అయ్యింది . కచేరీలు తగ్గేయి . ఈతరం వారి అభిరుచులలో కూడా చాలా మార్పు వచ్చింది . కానీ రాఘవరావుగారి తృష్ణ తీరలేదు . తనపిల్లలకి నేర్పి వారిని తీర్చి దిద్దుదామన్న ఆశ నిరాసే అయ్యింది . తన సహధర్మచారిణి సీతమ్మకి పాటరాదు . అసలు గొంతే పలకదు . కనీసం సంగీతం పట్ల ఆసక్తి కూడా లేదు. పిల్లలకి ఆమె పోలికే... అన్నట్లు , ఎవరి గొంతులోనూ సంగీత స్వరాలు పలికేవికావు . దానితో రాఘవగారు నిరాశ, నిస్ప్రుహలతో మూగబోయారు . దానికితోడు మారుతున్నకాలంతోపాటు మనుషుల అభిరుచులూ, వెకిలి సాహిత్యాల వెర్రికూతలూ, ఆచారవ్యవహారాల అంతులేని మార్పులూ మొగ్గలుతొడిగాయి . జనం పగలబడి ప్రాధాన్యత యిచ్చే పాటలకు సాహిత్యం కరువయ్యేది ,.సంగీతం బరువయ్యేది . రాఘవగారిలాంటి ఎందరికో ఈ మార్పు తీర్పులేని విచారణయ్యేది .

అటువంటి సమయంలో '' కావ్య '' పుట్టుక మహదానందాన్నిచ్చింది . కావ్య..తన మనుమరాలు , అది పుట్టినప్పుడే దాని కంఠంలో సప్తస్వరాల కదలికలు గమనించేరు . పెరుగుతున్న కావ్యతో బాటు అలనాటి సంగీత, సాంప్రదాయ కళా వైభవపు పరిమళాలు ఆమెలో గుప్పించారు .అతని నమ్మకం వమ్ముకాలేదు . శ్రావ్యమైన కంఠం , భగవంతునిమీద భక్తి , పురాణాలపై ఆసక్తి , అన్ని మంచి గుణాలకీ పెట్టయ్యింది కావ్య.

రాఘవగారి వడలిన జవసత్వాలలో బలం పుంజుకొంది . కంఠంలో కరడుకట్టిన సంగీతం కట్టలు తెచ్చుకొని బయటకు వచ్చీ, కావ్య గొంతుకి పదును పెట్టింది . ఫలితం ఎనిమిది సంవత్సరాల కావ్య సంగీతసరస్వతే అయ్యింది . తనుచెప్పిన తన చిన్ననాటి ముచ్చట్లు , కచేరీలు, సన్మాలగురించిన విన్న కావ్యమనసులో చిన్నికోరిక . తనూ కచేరీ చేయాలనీ, తాతయ్యలా చప్పట్లమధ్య కానుకలు గెలుచుకోవాలని .మనుమరాలి కోరిక, తన వాంచ ,తీరేందుకై రాఘవగారు తన సాయశక్తులా ప్రయత్నించీ చివరకు ఒక శ్రీరామనవమి సందర్భం లో కావ్యచే త్యాగరాజకృతులు పాడించేందుకు ఒక సభవారిని ఒప్పించగలిగేరు .

ఆ కాలంలో సంగీతకళాకోవిదులని వెతుక్కుంటూ వచ్చీ సాదరంగా వేదికమీదకు తీసుకువెళ్లేవారు . పాదాభివందనాలు , పూలాభిషేకాలతో పట్టం కట్టేవారు . కచేరీ పూర్తయ్యేదాకా జనం గౌరవంగా కూర్చొనేవారు . కచేరీ పూర్తి అయ్యినతర్వాత పాడినవారి శాంతి మంత్రాలముగింపు తర్వాత భక్తిగా దండాలు పెడ్తూ ఇళ్లకు తిరిగి వెళ్లేవారు . కానీ మారే మనిషి కాలం పేరుతో మన సంస్కృతీ, సాంప్రదాయాలని మూలకి నెట్టివేసేరు . కళాపోషకులు కరువై కళోద్ధరణకి కాకాలు పట్టవలసివస్తున్నాది .

ఆత్మాభిమానం చంపుకొని , మనుమరాలి కోర్కె తీర్చగలుగుతున్నందుకు ఒకపక్క ఆనందంగా ఉన్నా ..మరోపక్క అర్ధిస్తేగానీ అందని అవకాసాన్ని తలుచుకొని కృంగిపోయారు . కానీ మనుమరాలికి వచ్చిన మొదటి అవకాసం దిగ్విజయంగా పూర్తయితేచాలనీ , ఆమె గాత్రం, ప్రతిభ తెలిసినతర్వాత మరెన్నో అవకాసాలు రావచ్చన్న ఆలోచనలు ఆయన్ని రాత్రంతా నిద్రపోనివ్వలేదు . మగతనిద్రలో కావ్య కోకిలకంఠంతో పాడిన కీర్తనలకి , జనాల చప్పట్ల జోరు ,ప్రసంసల హొరుల తీపి కలల మధ్య తెల్లారినసంగతికూడా తెలియలేదు . కావ్యవచ్చీ లేపేదాకా.

గబగబా స్నానం ముగించుకొని పూజగదిలోకివచ్చేరు . పూజగదిలో కావ్య పుత్తడిబొమ్మలాగున్నాది . పట్టుపరికిణీ , జాకట్టు , జడగంటలు పెట్టిన పూలజడ , బంగారు భరణాలతో ,మెరుస్తూంటే , లక్ష్మీ , సరస్వతులు తనయింట నాట్యం చేస్తున్నట్లనిపించింది . ప్రసాంతమైన మనస్సుతో రామష్థ్థోత్తర పూజ ముగించీ, ఆ స్వామివారి కృపాక్షతలను కావ్యపైవేసి మనసారా దీవించేరు. \

ఇంటందరికీ ఒకటే హడావిడి . సాయంత్రం కాగానే కావ్యని ముద్దుగా తయారు చేసీ ,సందడిగా బయలుదేరేరు . పాడవిసిన స్థలం దగ్గరవుతున్నకొద్దీ అందరిలో ఒకటే ఆనందం , ఆతృత.
ఎంతమంది వచ్చీ ఉంటారో...కావ్యపాటవిని ఎంత ప్రసంసిస్తారో అనుకుంటూ , హాలులో ప్రవేసించిన వారి కనులకి ఖాళీ జంబుఖానాలూ , కుర్చీలూ వెక్కిరిస్తూ కనిపించేయి . ఎవరో నలుగురు కమిటీ సభ్యులు అటూ, ఇటూ తిరుగుతూ వీరినిచూసీ ,దగ్గరకువచ్చేరు .వారిలోకూడా నిరాస కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాది .

రాఘవగారిలో చిన్ని ఆశ . సంగీతం యిష్ఠం ఉన్న తనలాంటివాళ్లు కొంతమందైనా లేకపోరు . ఇంకా సమయం ఉంది కనకా జనం తాపీగా రావొచ్చన్న ఆశ నిరాసే అయ్యింది . ఏడవుతూండగా మరో నలుగురువచ్చేరు . మరిరారని నిర్ధారించీ కమిటీ సభ్యులు కార్యక్రమం ప్రారంభించమని కోరడంతో , రావుగారు కావ్యవైపు చూసేరు .

ఎంతో ఉత్సాహంతో పదిరోజులుగా తెల్లారి నాలుగు గంటలకే లేచీ సాధనచేస్తూ వచ్చిన కావ్యమొహం చిన్నబోయింది . రావుగారు కావ్య వేపు సూటిగా చూడలేకపోయారు . బోసిగావున్న ఆడిటోరియం తన ఆలోచనలను వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాది . తననుతాను సంభాళించుకొని ఒక
ధృఢనిశ్చయానికి వచ్చినరాఘవగారు , కావ్యతో '' ఎవరు విన్నా, వినకపోయినా ఆ శ్రీరామచంద్రులవారు నీ పాట వింటారమ్మా ...మొదలెట్టూ...అనగానే , తాతయ్య మాటలకు ఒక్కసారి ఆ దేవునివైపు చూసి , భక్తిగా నమస్కరించీ ,పాడడం మొదలెట్టింది .

అద్భుతమైన గాత్రం. అనంతమైన స్వర`జ్నానం.గంటసేపు సభాధ్యక్షులని ఏవేవో లోకాలకు తీసుకువెళ్లింది .చప్పబారిన చప్పట్లమధ్య ఎవరో మొబైల్ తో కావ్యని ఫోటో తీసేరు . కార్యవర్గం సభ్యులు వచ్చీ కావ్యచేతికి పూలగుచ్చాన్నిచ్చీ ప్రసంసించేరు . రెండు, మూడు గంటలుసాగవలసిన కచేరీ గంటలో పూర్తయ్యింది జనం లేనందున.

రాఘవగారు కావ్యచూపులని తప్పించుకు నడుస్తున్నారు. పరివారం వైపు చూడడానికే చిన్నతనంగా ఉంది. కొడుకు ఎన్నిసార్లు చెప్పలేదు , నాన్నగారూ.. పాత బాణీలకీ, పద్ధతులకీ ఈరోజుల్లో విలువనిచ్చేవారు ఎవరూ లేరంటూ....
చిన్నారి కావ్యకి తను ఎన్ని ఆశలు చూపించేడు .మన సాంప్రదాయాలకి , సంగీతానికీ మనవాళ్లు ఎంతవిలువనిస్తారో వివరించీ ఎంతలాచెప్పేడు . కానీ తను చెప్పిందేమిటీ ...జరిగిందేమిటీ....ఆలోచిస్తూనే రాఘవగారు కావ్య చేయి పట్టుకొని నడుస్తున్నారు .

రోడ్డుకి అవతలివైపు వేరేచోట రామనవమి సందర్భంగా ఎవరిదో ఆర్కెష్థ్రా తెప్పించినట్లున్నారు . ఈవైపువరకూ నిండిన జనం , ఈలలతో, వాయిద్యాల ఘోషతో రోడ్డు క్రిక్కిరిసి ఉంది .

కావ్యని ఎత్తుకొని , జనాన్ని తప్పించుకుంటూ రావడం లో అప్రయత్నంగా అటువైపు చూసేరు రాఘవగారు . ఆధునాతంగా అలంకరించబడ్డ స్థేజి మీద సీతా,రాముల విగ్రహాలు మూలగా అలంకరించబడ్డాయి . స్ఠేజి మధ్య పాడేవారికోసం మైకులు అమర్చబడ్డాయి . పదిమంది వాద్యబృందాల మధ్య ఒక స్థ్థ్రీ పలుచటి చీరని బొడ్డుకిందకి కట్టీ, లోనెక్ జాకట్టులోని అందాలు వంగి , వంగి మరీ చూపిస్తూ ..అర్ధం , పర్ధం లేని పాటలు పాడుతోంది . ఆమె చేస్తున్న డేంస్కి అనుగుణంగా ,చప్పట్లు కొడుతూ, జనం ఈలలు వేస్తున్నారు .ఒక జునపాల జుట్టాయన చినిగిన జీంస్ , చేతుల్లేని చొక్కాతో అష్థవంకర్లు పోతూ ఆమెమీద పడుతున్నపుడల్లా జనం వెర్రికేకలు వేస్తున్నారు . కెమేరావాళ్ల హడావిడి, వీడియోవారి తోపులతో , మరింత మూలకి జరపబడ్డ సీతారాముల విగ్రహాలు , భక్తిలేని జనాలమధ్య , కాంతిహీనమై వెలవెల పోతున్నాయి . ఈ కాలుష్యాన్ని ఎక్కడ చూస్తుందో నని భయపడ్డ రాఘవగారు కావ్యనెత్తుకొని జనాన్నితోసుకుంటూ బయటపడ్డారు .

పక్కవీధిలో జరిగే కోలాహలంలో ఒకవంతైనా కచేరీ జరిగేచోటికి రానందుకు , మన సంస్కృతి విలువలు తగ్గేయి అనుకున్నారు కానీ మరీ ఇంతలా దగజారిపోయాయా .... అనుకొని , దిగ్భ్ర్రాంతిపడి ,ఆశ్చర్యపోయారు . అలసిన కావ్య భుజమ్మీదే నిద్రపోతున్నాది . ఆమెచేతిలో సభవారిచ్చిన గులాబీ వడలి వాలిపోతున్నాది .

కావ్య మొహం చూసిన రాఘ్వగారి కంట్లో నీరు చిమ్మింది . ఈ చిన్నారికి ఎన్నిమాటలు చెప్పేనూ, ఎన్ని ఆశలు చూపించేనూ ... మొదటిసారే ఘోరంగా విఫలమై , మనసులో తగిలినగాయం ,చిదిమి చీము పట్టదుకదా...

ఆలోచనలతో నిస్థ్ర్రాణ ఆవహించిన రాఘ్వగారు తమ ఇంటి సందులోకి ప్రవేసించీ, మెల్లగా నడవసాగేరు .తమవీధి వేంకటేశ్వర ఆలయంలో స్వామివారి దివ్యమంగళ విగ్రహం చిరుదివ్వెవెలుగులో చిద్విలాసంగా కటకటాలతలుపువెనక కవ్విస్తూకనిపించింది . ఒక్కక్షణం ఆగేరు . రాఘవగారు తప్ప ఆదేవదేవునికి సుప్రభాత, పూజాపునస్కారాలు చేసేవారులేరు . ఏ పండగకో, పుణ్యానికో పక్కవూరి పూజారిగారితో అర్చనలు చేయించుకుంటారు ఆవూరివారు . అయినాసరే స్వామి నవ్వుతూ అలా నిల్చునేవుంటారు . ఈ ప్రజలసంగతి తెలిసినవాడు కనకనే శిలారూపంలో బిగుసుకుపోయాడు .

నిద్రపోతున్న కావ్యని కింద పడుక్కోబెట్టీ, గుడి స్థంభానికి ఆనుకొని కూర్చున్నారు .
కళాపోషణ లేని సంస్కృతికి నిదర్సనంగా దూరంగా మైకులోంచీ బూతుపాటలు వినిపిస్తున్నాయి . ఈలలగోల చీదరపరుస్తున్నాది .

'' ఇదీ ఒకరకమైన కళాపోషణేకదా '' అన్నట్లు స్వామివారి విగ్రహం చిరునవ్వులు చిందిస్తూనేవుంది
Wednesday, November 4, 2009

దేశభక్తిగీతాలు .

దేశభక్తిగీతం.
కల్యాణీ రాగం
*****

తల్లి భారతి తరలివచ్చెను
కావ్య మంజరి కవితలా..
మేలు మువ్వల సడుల ,సరిగమ
సప్త స్వర జతి , పదములా.. '' తల్లి ''

సస్యశ్యామల వర్ణమది ఆ
మేని గిరులా ఒంపులూ...
పైరు,పచ్చని చీరకట్టెను ,
ప్రకృతి పడతీ సొంపులూ...
నీలి మబ్బుల కురుల నిండెను
మిణుకుతారల మాలలూ..
సూర్య, చంద్రుల కాంతి కన్నుల
కరుణ నిండిన చూపులూ.. '' తల్లి ''

త్యాగరాయ శ్రీ రామదాసు ,
వాగ్గేయకారుల కీరితీ...
పుణ్యచరితపు మేటి -
రత్నాలాయె ఆమెకు సంతతీ...
గాంధి, నెహృ వంటి నేతలు
నిలుప శాంతీ, సౌఖ్యమూ ..
వీర గతినే పొందు సుతులకు
మాత ఒడి తరుకల్పమూ... '' తల్లి ''

శ్రీనాధుల, క్షేత్రయ్యల పదము-
బంగరు మకుటమూ...
విజయనగరా..కాకతీయుల
ఖ్యాతి రత్నపు పీఠమూ...
వీర పురుషుల రుధిర ధారలు
భరతమాత సుచరితమూ ..
పుడమి తల్లికి నుదుటి బొట్టై
వెలిగె ధర్మపు చక్రమూ... '' తల్లి ''

మూడురంగుల మూలమైనది
శాంతి ,ధర్మ ,సుసత్యమూ..
ఎగిరె నదిగో రాజసమ్ముగ
ఒరగనీయకు నిరతమూ....'' తల్లి ''

*****

ఎంత అందమైనది స్వాతంత్ర్యబాలా..
రంగుపూల చీరచుట్టె నీవేళా..
భరతమాత సిగనిండుగ ముద్దబంతులూ
మెడనిండుగ మెరయు చామంతి దండలూ '' ఎంత ''

సూర్యకాంతి పూల పసిమిచాయతో,
ముద్దమందారాలా నుదుటి బోట్టుతో ,
విరిసిన కలువల రేకుల కాంతి కనులతో,
లేలేత గులాబీల అధర సుధలతో '' ఎంత ''

మల్లెలు, మరువము నిండిన నీలవేణిగా..
జాజీ , కనకాంబరాలె మేని సొగసుగా..
పచ్చనీ చేలనడుమ పరిమళాల వీచిగా
పాడి,పంట సొగసుల సంక్రాంతి లక్ష్మిగా.. '' ఎంత ''

జాతి-భేదమెరుగని మన తల్లికిదే స్వాగతం ,
సమత ,మమత నిండిన సుమ-వల్లికిదే స్వాగతం ,
శాంతి - సౌఖ్యాల కల్పవల్లికి సుస్వాగతం ,
క్షమయా-ధరిత్రి భరతమాత కిదే స్వాగతం '' మూడు సార్లు ''

*****

హంకొ మనుకి శక్తిదేన వరస
*****

విశ్వశాంతి నిలుపు శక్తి మదిని పెంచుకో ..
సమత ,మమత వెల్లి విరియు బాట నెంచుకో ''..విశ్వ ''

భేదభావ మెరిగినట్టి స్నేహమెందుకూ...
బాధలోని తోడుకాని బంధమెందుకూ ..
వేదసారమంత ఎరుగ వేడుకెందుకూ..
సాటివారి తూలనాడు చదువులెందుకూ... '' విశ్వ ''

కలసి ,మెలసి శాంతి నిలుపు మంచి మనసుతో ,
చేయి ,చేయి కలిపి నడువు ధర్మనిరతితో..
మన ఝండా కీర్తి నిలుపు , మదిని భక్తితో ..
భరతమాత ఖ్యాతి పెంచు భవ్యచరితలో... '' విశ్వ ''

*****

పెళ్లిపాటలు .

Kalyanam Paatalu

పెళ్లిపాటలు.
*****
పెండ్లి పిలుపు
*****

కల్యాణము చూతమురారండీ ...
శ్రీ వేంకట రమణుని '' కల్యాణము''

మంటపమున ముత్యాల ముగ్గులివె
మంగళకరమగు వేద మంత్రమిదె
అంబరమున ముక్కోటిదేవతలు
సంబరపడుచూ దీవెనలొసగిన '' కల్యాణ ''

సిరికల్యాణపు బొట్టునుపెట్టీ .....
నుదుటను మణి బాసికమును గట్టీ ....
సోగసౌ బుగ్గను చుక్కను బెట్టీ ...
పెండ్లీ కొడుకై నిలచిన గిరిపతి '' కల్యాణ ''

సిగ్గుల సిరిమెడ సూత్రము గట్టీ...
మంగళకరమౌ మట్టెలు బెట్టీ...
సోయగమున సతి చేతులబట్టీ..
మంగాపతిగా వేలసిన శ్రీ హరి '' కల్యాణ ''

నవరత్నములను తలపైపోసీ...
నవరసముల నళినాక్షిని బట్టీ ..
జవరాలికిసిగ జాజులు జుట్టీ..
శృంగారమునే నెరపిన శ్రీపతి '' కల్యాణ ''

యిరువురు భార్యల నురముననుంచీ ..
మురిపెపు నగవుల ముడుపులదోచీ ...
కరుణతో కరముల నభయమునిచ్చీ..
యిడుముల బాపుట కిలవెలసిన హరి '' కల్యాణ ''








*****
పెండ్లి కొడుకు రాక .
*****
రాగం =హంసద్వ్హని
*****
వచ్చెనదే ఘనుడూ...సిరీ...
మెచ్చిన శ్రీకర శుభద మనోహరుడూ '' వచ్చె ''

రాజసమున రారాజుల పోలీ ..
నిజసతి నేలగ , నిఖిలోత్తముడూ...
ద్విజులకు మ్రొక్కీ, దీవెన లందగ
నిజసతి దోడ్కొన నిలచినవాడూ...'' వచ్చె ''

సతి నెరచూపులా చిక్కినవాడూ
సరస శృంగారమూ నెరపెడువాడూ
చిరునగవుల చెలి , హృదినిలచినవాడూ
సరి సతి నేలినా , సర్వోత్తముడూ.. '' వచ్చె ''

యిలవెలసిన హరి యిందిరా రమణుడూ
వైకుంఠ ధాముడూ నారాయణుడూ....
అల శేషాద్రిపై వెలసిన మాధవుడూ ...
ఆపద మ్రొక్కులూ దీర్చెడివాడూ ..'' వచ్చె ''

*****

రాగం = మిశ్రఖమాస్ .
*****
గౌరీపూజ .
*****

పేరంటాండ్లనడుమా పెండ్లికూతురూ
పాల బుగ్గల్లో సిగ్గులతెర పెండ్లికూతురూ ,
పసుపు పారాణీ పాదాలా పెండ్లికూతురూ ,
మెరపు మేని సొగసు నిండారగ పెండ్లికూతురూ.. '' పేరం ''

పట్టుచీర సింగారపు పెండ్లికూతురూ..
పెట్టె కల్యాణపు బొట్టు నుదుట పెండ్లికూతురూ,
జుట్టె సిరిమల్లెలు జడనిండుగ పెండ్లికూతురూ..
యిట్టె సిగ్గు బుగ్గచుక్క మెరయు పెండ్లికూతురూ.. ''. పేరం ''


కిల,కిల నవ్వుల నడుమా పెండ్లికూతురూ..
కళలు పదునారూ నిండిన సిరి పెండ్లికూతురూ..
తలచి శ్రీ గౌరికి పూజలిడిన పెండ్లికూతురూ..
పసుపు , కుంకములా నోమునోచె పెండ్లికూతురూ '' పేరం ''

బుట్టలోన కూరుచున్న పెండ్లికూతురూ ,
మామ బుట్టనెత్త సిగ్గుపడే పెండ్లికూతురూ..
చలువ సౌభాగ్యము నొడినిపట్టె పెండ్లికూతురూ
మదిని మాంగళ్యపు వరము కోరు పెండ్లికూతురూ '' పేరం ''

మెత్తని మెల్లని అడుగుల పెండ్లికూతురూ ,
ప్రియుని పెండ్లాడగ వచ్చెనదే పెండ్లికూతురూ ,
తలను తలంబ్రాలు , సూత్రపుమెడ పెండ్లికూతురూ
విభుని జట్టిగొనీ చేయిపట్టె పెండ్లికూతురూ..... '' పేరంటాండ్ల ''

*****

మోహనరాగం .
*****
తోటసంబరం.
*****

శ్వాగతమిడగా రారే చెలులూ..
వచ్చెనదే వియ్యాలవారూ.... '' స్వాగత ''

కప్పురపు మాలలూ , వేయరె మెడలో..
జాజులు ,మల్లెలూ ,తురమరె జడలో...
వాడని వీడెమూ , వేడ్కగ నిచ్చీ ...
ఆటల, పాటలా... ఆనందముగా....''..స్వాగత ''

పసుపు , కుంకుమలూ , పలు అత్తరులూ ..
విరిపారాణి , పన్నీటి గంధములూ...
ప్రేమతోనిచ్చీ...భామల తోడ్కొని ,
విడిదికి రమ్మనీ వేగ పిలువరే.... '' స్వాగత ''

తేనెలమాటలా, మన్నన పిలుపులా..
పంచరె తీయనీ పానీయములూ...
మచ్చిక మీరగ , ముచ్చట తీరగా...
అంగన లీయరె హారతులూ ..... '' స్వాగత ''

*****
వియ్యాలవారి కయ్యాలు.
ఆడపెళ్లివారిపాట.
*****

ఏడనుంచి వచ్చిరి , వియ్యాలవారూ...
మేడ,మిద్దెలుగల మావూరికి వేంచేసారూ ..
వల్లెపెట్టి ఏర్చి కూర్చి మంచి మాటలాడేరూ
మా తల్లి చక్కదనపు , మల్లి చేబట్టేరూ...'' ఏడ ''

బియ్యేలా, ఎం. యేలా వంశమన్నారూ..
పెండ్లికొడుకుగారి నత్తిమాట స్ఠైలన్నారూ..
పిల్లమెడలోనా గుళ్లపేరు వేస్తామన్నారూ..
వల్లమాలిన మాటల్లు చెప్పి మోసపుచ్చేరూ ..'' ఏడ ''

నల్లకోటు జాబంటూ నసబెట్టేరూ..
'' నల్లి '' వారి పట్టుబట్ట తప్ప కట్టమన్నారూ..
నలుగు ముతక నేత బట్టలతో విడిదికొచ్చేరూ
నాసి రకపు , సెంటు , సింగారాల్ బడాయి పోయేరూ..'' ఏడ ''

కట్నాల్ , గిట్నాల్ మాకసలే వద్దన్నారూ..
కుర్రవానిపేర '' క్వాలి '' సొకటి చాలన్నారూ
పిల్లపేర కొంత '' భూ '' దానం చేయమన్నారూ
వద్దు, వద్దంటూ గొంతెమ్మల కోర్కెల్ల్కోరేరూ.... '' ఏడ ''

ప్లేటు భోజనాలు తప్ప , చేయమన్నారూ
రేటు నూరైనా స్వీట్లు , హాట్లు కావాలన్నారూ..
చేటు చెప్పుకుంటే , చేతుల్నాకి చిందులేసారూ
చాటు ,మాటునస్వీట్లన్ని దాచి దొరకిపోయేరూ '' ఏడ ''

పిల్లతోడ రండంటూ పట్టుబట్టేరూ ...
పెద్ద యిల్లు మాది చోటుకొరత లేదన్నారూ..
మురికి లోగిల్లో , ముతకబొంత మూలవేసారూ
నల్లికాట్ల రాత్రి , నిద్రలేమి మాకు చేసారూ '' ఏడ ''

పొలము ,పాడి మాకుందని పోరి చెప్పేరూ
పోట్ట నిండనట్టి టిఫిను పెట్టి తుర్రుమన్నారూ
గల్లంతై , గంటెడైన పాలుపోయనట్టి మడ్డి
కాఫీలూ మాకిచ్చీ మాడబెట్టేరూ '' ఏడ ''

*****
మగపెళ్ళివారి పాట .
*****
ఆనందభైరవి రాగం.
*****

ఎంత గదుసువారు ఆపెళ్లివారూ... .
మంచి మాటలతో మమ్ము మోసపుచ్చినారూ...
అంచనాకుమించి ఆశ చూపించినారూ...
ఎంచి ,ఎంచి మంచి వలను మాకు వేసినారూ '' ఎంత ''

పనీ, పాటా వచ్చుననీ , పిల్లమాట చెప్పినారు ,
ఆట ,పాట లందు మేటి , గుణము మంచిదన్నారూ ,
చదువు సంధ్యలందు తెలివితేటలు మెండన్నారూ
అందమందు ఆ రంభకు తీసిపోదన్నారూ '' ఎంత ''

పెళ్ళిచూపులందు చీర చుట్టబెట్టి తెచ్చినారు ,
మొగము నెత్తి చూపమంటె '' సిగ్గు'' పిల్ల కన్నారూ ,
పాట పాడమంటె '' బిడియ '' మొదలలేదన్నారూ,
పెండ్లి కానివ్వమనీ తొందరెంతొ చేసారూ '' ఎంత ''

పనీ, పాట మాటలేదు , సిగ్గు, సరము అసలు లేదు
మాట కరకు, మనిషి దుడుకు ,మంచినెంచు బుద్ధి లేదు
కట్న, కానుకల్లు లేవు , కారునలుపు , నమ్మలేరు ,
చదువు సున్న, తెలివి కన్న, ఒళ్లుబద్ధకము మిన్న '' ఎంత ''

కళ్ళుమెల్ల , బొజ్జపిల్ల , ఎత్తుపళ్ల నోరు మళ్ల ,
పిప్పిపన్ను జతగూడెను , అందానికి తోడుమళ్ల ,
ఫెళ్లుమన్న నవ్వు , పోతురాజు తిండి కాదు కల్ల ,
ఖర్మ| మాకు లేదు దారి, పిల్ల నేలుకొనగ నిల్ల '' ఎంత ''

*****
అప్పగింతలపాట.
*****
ఆనందభైరవిరాగం
*****

''పుల్లాభట్లా'' రింటీ పుత్తడిబొమ్మా...
కల్లా, కపటములెరుగని కోమలివమ్మా..
ఉల్లాసములాతేలెడి అందాలకొమ్మా,
''సరిపిల్లీ ''వారింటా అడుగిడవమ్మా....
మాముద్దులగుమ్మా.....

కొత్త కోర్కెలు మదిలో కలగంటీవమ్మా..
అత్తింటీ మురిపాలూ అందుకోవమ్మా..
అత్త,మామల ముద్దు -మురిపాల పూరెమ్మా,
పుట్టినింటీ పేరూ ,నిలబెట్టవమ్మా...
మాముద్దులగుమ్మా....

''రఘురాముని'' ఏలికలో రతనాల బొమ్మా....
విభునీ చిత్తములెరిగీ మసలుకోవమ్మా...
'' భాస్కర, సుభద్రమ్మ'' ల, ముద్దుల కోడలివమ్మా..
మరపించెదరూ మమ్మూ , భయమేలనమ్మా..
మాముద్దులగుమ్మా '' పుల్లా''

*****
చుట్టాల సందడి .
పెళ్లిభోజనాలు .
*****

వివాహ భోజనమ్ము వింత వంటకమ్మురా..
వియ్యాలవారి యింట భలే రుచులపంటరా '' వివాహా''

ఒహొహ్హొ | నేతి లడ్లు , అహహ్హ రసపు చుట్లు ,
బొబ్బట్లు వహరె బూరల్ తీపి పాయసమ్మురా..
ఇహిహ్హి బాసుందీలూ.. ఇవిగివిగొ కోవా పాలూ,
జిలేబి , జాంగ్రి వరుసదొంతు లరిసె లివేరా ...''. వివాహ ''

మిరపబజ్జీల్ ,పకోడీలు , పప్పు వడలురా..
పులిహోర , దప్పడాలు ,వడలు తినగ రండిరా..
సాంబారు ,రసము వరెవ్వా , పొడికూర అరటిదవ్వ ,
ఈ పనసపొట్టు ఆవ , గుత్తి వంకాయ్ భలేరా .. '' వివాహా''

ఈ దోసఆవకాయా , పులుపూట నిమ్మకాయా..
గోంగూర నేతి పోపు, రుచుల గడ్డపెరుగురా..
ఐస్ క్రీము ఆఖరంటా.. తినపోతె ఒప్పరంటా...
ఇంటింట పెళ్లివంట అదే..మనకు పంటరా... '' వివాహ ''


ఈ వంటకం ముచ్చట్లూ ..తిన,తినగ ఆయాసాలూ..
తీర్చంగ తాంబూలాలు , వక్కపొడులు ఇవిగొరా ..
తిన్నింటివారి యింటా , పెరుగునులే పాడి ,పంటా
దీవెనలు ఇత్తురంతా , '' వర్ధిల్లు కొత్తజంటా ''... '' వివాహ

నవావరణ శ్లోకములు

Navaavarana Slookams

|| ధ్యానం ||

ధ్యాయేత్ ఆది మధ్యాంత రూపిణీ ,
అఖండైక రస వాహినీ, |
అష్థాదసా పీఠ అఘనాసినీ, దేవి ,
ముక్తిప్రదాయినీ, సంగీతరసపోషిణీ ||

అరుణ కిరణోజ్వలాకాంతిరసభాసినీ,
అ,క,చ,ట,త,ప వర్గాది గుణభేదినీ , |
అంబ యంత్రాది ,కాది,సాది,
మంత్రాది వసనీ ,కామేశి శివకామినీ ||

1. త్రైలోక్యమోహన చక్రం .
ఆనందభైరవి రాగం .
*****
సర్వానందకరీం ,జయకరీం ,
త్రిపురాది చక్రేశ్వరీం |,
శర్వాణీ షడ్చక్రభేదకరీం ,శివసతీ,
నిగమాదిసంవేదినీం ||

మహిషాసురాది దైత్యమర్దనకరీం ,
భయహరీం, అణీమాద్యష్థ సిద్దేశ్వరీం |,
'' త్రైలోక్యమోహనచక్ర'' నిలయీం ,
సురనుతాం,'' ఆనందమయి భైరవీం'' ||

2 సర్వాశాపరిపూరకచక్రం ,
కళ్యాణి రాగం.
*****
'' సర్వాశాపరిపూరకచక్ర ''నిలయే ,
శర్వాణి శివవల్లభే .|
శ్రీవాణీ, రమా ,సేవితపార్స్వయుగళే ,
పర్వేందుముఖి పార్వతే ||

దూర్వాసార్చిత దివ్యపాదయుగళే ,భగవతే,
భవ,బంధ,భయ మోచకే |
ఉర్వీతత్వాది స్వరూపిణీం , చైతన్యఖనీం ,
'' కళ్యాణి '', ఘనరూపిణీం ||
3 . సంక్షోభణచక్రం .
శంకరాభరణం రాగం .
*****
అనంతకోటి బ్రహ్మాండనాయకీం ,
''సర్వసంక్షోభిణీం'', బ్రహ్మాణి బహురూపిణీం |
అనంగాద్యుపాసినీం అనంగకుసుమాం,,
అంబ అష్థ్థాదశాపీఠికాం ||

హస్తే అంకుశ,చాప, బాణ, ధనుధరీం ,
జయకరీం తత్త్వప్రదే , శాంకరీం |
శతసహస్రరత్నమణిదీప్తీం,మందేస్మితేందువదనాం ,
' శంకరాభరణవేణీం '' ||

4 .సకలసౌభాగ్యచక్రం .
కాంభోజిరాగం .
*****

నమ: అంబికాయై , నమ:చండికాయై ,
నమ : ఓంకార, హ్రీంకార, బీజాక్షరై |
నమ '' కాంభోజ''చరణే ,చతుర్దశభువనే ,
'' సకలసౌభాగ్య '' శుభదాయినే ||

నమ:కల్మషహరణే కలిసంతరణే ,
చతుర్వర్గ ఫలదాయినే ......|
నమ: కామేశ్వరీ, కాళికే, ఘనకపాలికే,
సకల భువనాంతర్గతపాలికే ...||

5 . సర్వార్ధసాధకచక్రం .
భైరవిరాగం .
*****
'' సర్వార్ధసాధకచక్ర '' నిలయే,
బహిర్దసాదిచక్రవలయే, బహురూపికే ''భైరవే'' |
నిత్యశుద్ధే, ముక్తబుద్ధాభేద్య, సత్ --
చిదానందమయి సాత్వికే ||

త్త్ర్రైమూర్తి త్రిగుణాత్మికే ,ధరనుతే ,
క్షిత్యాదిశివశక్తి స్వరూపాత్మికే. |....
కదంబవనవాటికే, త్రిభువనపాలికే,
దేవి త్త్వ్రైలోక్యరక్షాళికే ,,,,,||

6. సర్వరక్షాకరచక్రం .
పున్నాగవరాళిరాగం .
*****

దశరాదివినుతే గురుగుహవిదితే , దేవి-
దశశక్తి దైత్యాళికే ..... |
''సర్వరక్షాకరీ '', సర్వసంపత్కరీ , దేవి ,
కైలాశరమణేశుమణి సాత్వికే ||

దశకళాత్మికే , దశరసాత్మికే ,దేవి -
సంగీత, సాహిత్య , రసపోషికే.....|
అతిమధురవాణీ ,'' పున్నాగవరాళివేణీ ''
పాహి | సర్వజ్ఙే శివకామినీ....||

7 . సర్వరోగహరచక్రం .
శహనరాగం .
*****

రాజీవనయనే ,.. రాకేందువదనే ,
''శహన'' రాగోత్సాహి లయరంజనే |
స్వాత్మానుభోగినీ , శుభరాజయోగినీ
దేవి ,ఓంకారి, హ్రీంకారి ,జనమోదినీ ||

అతిరహస్యయోగినీ "సర్వరోగహరచక్రస్వామినీ ''
దేవి వాగ్దేవతారూపి విద్యాఖనీ |
కోదండధారిణీ , వీణాసువాదినీ , దేవి -
శరణార్తిశమనీ , సుసౌదామినీ ..||


8 . సర్వశిద్ధిప్రదచక్రం .
ఘంటారాగం .
*****
ఆవాహయే దేవి , అరుణోజ్వలే, అంబ -
దైత్యాళి , జయకాళి , జగదంబికే ....|
సర్వ శక్త్యాత్మికే , దేవి సుకసారికే దివ్య ,
'' ఘంటామణిఘోష '' కవాటికే.......||

నఖోదితవిష్ణు , దశరూపికే , దేవి
దశాకరణ శబ్ధాది అంతర్లయే |
సర్వాత్మికే , సర్వరక్షాకరీ, '' సర్వ -
వరశిద్ధిప్రదదాయి '' త్రిపురాంబికే ||

9 .సర్వానందమయచక్రం .
ఆహిరిరాగం .
*****

జయతి జయతి అంబే, శృంగారరస కదంబే ,
శివకామేశ్వరాంకస్థ - బింబేందుబింబే....|
చింతామణిద్వీప మంచస్థ్థితే , దేవి -
చిద్బింబ , శివరూపి , చక్రస్థితే......... ||

కమలాంబికే దేవి విమలాత్మికే ,
''సర్వ ఆనందమయి'' రూపలలితాంబికే |
శాకంబరీ, దేవి శాతోదరీ జనని ,
దుర్గా,రమా, వాణి సతి సాత్వికే ||

జమంగళం |, దేవిం శుభ మంగళం ||
నిత్య జయ మంగళే , శక్తి కురు మంగళం ||

ఓం | భూ: శాంతిప్రదే | భువన శాంతి ప్రదే |
భూత , ప్రేతాది - గ్రహపీడ శమనహ్రదే .....|
సకలసౌభాగ్య ప్రద పూర్ణమయి మంగళే |
ఓం.......శాంతి:......శాంతి: ......శాంతి:. . ||

రచన -
పుల్లాభట్ల జగదీశ్వరి .